ఎమ్మెల్యే 'దుర్గం' చుట్టూ ఆరిజన్ ఉచ్చు..!

by Disha Web Desk 9 |
ఎమ్మెల్యే దుర్గం చుట్టూ ఆరిజన్ ఉచ్చు..!
X

దిశ ప్రతినిధి, నిర్మల్: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి శాసనసభ్యుడు దుర్గం చిన్నయ్య చుట్టూ ఆరిజన్ డెయిరీ వివాదం ఉచ్చు బిగిసేలా కనిపిస్తుంది. ఆరిజన్ డెయిరీ పేరిట ప్రారంభమైన వ్యాపారంలో పరోక్షంగా తన వ్యక్తులకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు రెండెకరాల స్థలం ఇప్పిస్తామని నమ్మబలికి మోసం చేశారంటూ, ఆపై మహిళలపై వేధింపులు తీవ్రం చేశారని ఆరోపిస్తూ కంపెనీ సీఈవో శేజల్ చేస్తున్న పోరాటం రాజకీయంగా ఎమ్మెల్యే చిన్నయ్యకు మాయని మచ్చగా మారుతున్నది. అయితే తాను ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు చర్యలు తీసుకోలేదని ఆమె రాష్ట్ర స్థాయిలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు మానవ హక్కుల సంఘాలకు, మహిళా కమిషన్లకు ఫిర్యాదు చేసిన ఆమె తాజాగా ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ వ్యవహారం ఎమ్మెల్యే చిన్నయ్య మెడకు ఉచ్చు బిగిసుకునేలా తయారవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఎన్నికల వేళ.. ఏమిటి గోల..

అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పై ఓ మహిళ సాగిస్తున్న పోరాటం అటు రాజకీయ వర్గాలతో పాటు ఇటు సామాజిక వర్గాల్లోనూ తీవ్రమైన చర్చకు దారితీస్తోంది. వాస్తవం ఏం జరిగిందన్నది లోతుగా ఎవరికి తెలియక పోయినప్పటికీ... ఓ మహిళ బహిరంగంగానే తనకు అన్యాయం చేశారంటూ లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ ఆ దిశగా కనీస చర్యలు తీసుకోకపోవడం ఫిర్యాదులపై దర్యాప్తు జరపకపోవడం వంటి అంశాలపైనే పలు వర్గాలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. ఓ మహిళ నేరుగా ఫిర్యాదు చేస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోరని... అధికార పార్టీ శాసనసభ్యుడు అయినందువల్లనే అటు పోలీసులు ఇటు ప్రభుత్వ యంత్రాంగం స్పందించడం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరిజన్ సంస్థలో తన బంధువుకు భాగస్వామ్యం ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో పాటు, ఉద్యోగరీత్యా తన సహచరిగా వచ్చిన ఓ మహిళ ఉద్యోగిని ఎమ్మెల్యే చిన్నయ్య ప్రైవేటుగా తనను కలిసేలా చూడాలని ఒత్తిడి చేశారంటూ సంస్థ సీఈవో శేజల్ ఆరోపిస్తూ వస్తుంది.

ఎక్కడ న్యాయం జరగక పోతుండడంతో మరణమే శరణ్యం అంటూ ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. అయితే ఎన్నికలకు ముందు ఈ ఘటనలు వరుసగా జరుగుతూ ఉండటం ఎమ్మెల్యే చిన్నయ్యకు తలనొప్పిగా మారుతున్నది. స్థానికంగా పోలీసులకు ప్రభుత్వ శాఖల అధికారులకు ఫిర్యాదు చేసిన సీఈవో రాష్ట్రస్థాయిలోనూ కొంతకాలంగా పోరాటం చేస్తూ వస్తోంది అయినప్పటికీ యంత్రాంగంలో చలనం లేకపోవడంతో ఆమె నేరుగా ఢిల్లీకి వెళ్లి జాతీయ మహిళా కమిషన్ తో పాటు ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు చేశారు. అక్కడే ఆత్మహత్యాయత్నానికి ఒడి కట్టారు. ఈ పరిణామాలు ఎన్నికల ముందు జరుగుతుండడంతో చిన్నయ్య తో పాటు అధికార పార్టీకి సైతం తీవ్ర తలనొప్పిగా తయారవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారానికి ఎలా పుల్ స్టాప్ పడుతుందోనని అధికార పార్టీ వర్గాలు సతమతమవుతున్నాయి.

రాజకీయ కుట్ర ఉందంటున్న దుర్గం వర్గీయులు..

తాను ఎలాంటి తప్పు చేయలేదని అనవసరంగా తనను ఇబ్బంది పెట్టేందుకే ఈ వ్యవహారం చేస్తున్నారని ఎమ్మెల్యే చిన్నయ్య స్పష్టం చేస్తున్నారు. ఆయన అనుచరులైతే ఒక అడుగు ముందుకు వేసి తమ నేత చిన్నయ్యను తట్టుకోలేకనే బురద జల్లుతున్నారని మండిపడుతున్నారు. బెల్లంపల్లి నియోజకవర్గంలో రాజకీయంగా ఎదుర్కోలేని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరిజన్ వ్యవహారాన్ని గోరంతలు కొండంతలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారంలో వాస్తవం ఉంటే ఇప్పటిదాకా ఆధారాలు ఎందుకు బయట పెట్టలేకపోతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారం సద్దుమనగాలంటే ఎమ్మెల్యే చిన్నయ్య స్వయంగా సంస్థ ప్రతినిధులతో చర్చలు జరపడం మేలని ఆయన సన్నిహిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. లేదంటే రాజకీయంగా ఆయనకు ఈ వ్యవహారం వచ్చే ఎన్నికల్లో కొంత ఇబ్బందిగా మారుతుందని చెబుతున్నారు. తాజాగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్యే చిన్నయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.



Next Story

Most Viewed