ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం సహించం..

by Disha Web Desk 20 |
ఆరోగ్య కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం సహించం..
X

దిశ ప్రతినిధి, నిర్మల్ : ప్రభుత్వం అమలు చేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాల అమలులో అధికారులు, ఉద్యోగుల నిర్లక్ష్యాన్ని సహించబోమని రాష్ట్ర కమిషనర్ శ్వేతా మహంతి హెచ్చరించారు. బుధవారం ఆమె నిర్మల్ జిల్లాలో పర్యటించారు. పలు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల డీఎం అండ్ హెచ్ వో లు ప్రోగ్రాం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. నిర్మల్ పర్యటనలో ఆమె ముందుగా పట్టణంలోని మంగల్పేట్ రామ్ నగర్ పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న కంటివెలుగు శిబిరాలను సందర్శించారు.

అనంతరం దిలావర్పూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించి కార్యక్రమం అమలుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం నిర్మల్ పట్టణంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ అమలవుతున్న గర్భిణీలకు సేవలతో పాటు ప్రసూతి సేవలు పై నేరుగా మహిళల వద్దకు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆదిలాబాద్ నిర్మల్ జిల్లాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లతో పాటు ఇతర సిబ్బందిని నియమించుకోవాలని చెప్పినప్పటికీ జాప్యం ఎందుకు జరుగుతుందని నిలదీశారు.

వెంటనే వారందరి నియామకాలు పూర్తిచేసి వైద్య సేవలు సక్రమంగా అందేలా చూడాలని సూచించారు అలాగే అసంక్రమిత వ్యాధుల విభాగం ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు సజావుగా సాగకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. రెండు జిల్లాల్లోనూ కొన్ని కార్యక్రమాలు మందకొడిగా సాగుతున్నాయని వాటిని వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ డైరెక్టర్లు పద్మజ, నిర్మల్ ఆదిలాబాద్ జిల్లాల వైద్యాధికారులు డాక్టర్ ధనరాజ్, డాక్టర్ నరేందర్, ఆయా శాఖల ప్రోగ్రాం అధికారులు డిప్యూటీ డీఎం అండ్ హెచ్వోలు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Next Story