CM KCR కు ఆ నిధులపై చర్చించే దమ్ముందా..? MP Bandi Sanjay సవాల్

by Disha Web Desk 19 |
CM KCR కు ఆ నిధులపై చర్చించే దమ్ముందా..? MP Bandi Sanjay సవాల్
X

దిశ ప్రతినిధి, నిర్మల్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తన పాదయాత్రలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నారు. పాదయాత్రలో భాగంగా ఎక్కడ ఆగినా.. ఎవరితో మాట్లాడిన కేసీఆర్ కుటుంబం చేస్తున్న కుటుంబ పాలనతో పాటు, అనేక అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఆయన పదునైన భాషతో విమర్శలు ఎక్కు పెడుతున్నారు. బుధవారం బండి మూడో రోజు పాదయాత్రను 5.8 కిలోమీటర్ల మేర సాగించారు. మంగళవారం రాత్రి గుండెగాం గ్రామంలో బసచేసిన బండి సంజయ్ బుధవారం ఉదయం గ్రామ కూడలిలో రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రామ పెద్దలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

తేళ్లు పాములతో సవాసం చేస్తున్న పట్టదా..?

పల్శీకర్ రంగారావు ప్రాజెక్టు నిర్మాణం సమయంలో గుండెగాం గ్రామం ముంపునకు గురవుతుందని తెలిసినప్పటికీ అధికార యంత్రాంగం చర్యలు తీసుకోలేదని ఈ సందర్భంగా బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబం ఒక్కటి చల్లగా ఉంటే చాలా అని ప్రశ్నించారు. ఇదే గ్రామంలో కేసీఆర్‌కు గాని ఆయన కుటుంబానికి గాని భూములు ఉంటే పరిస్థితి ఇలాగే ఉండేదా అని నిలదీశారు. గత కొన్నేళ్లుగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఈ గ్రామస్తులు ప్రాణ భయంతో వణికిపోతున్నారని.. తేళ్లు, పాములతో సహవాసం చేస్తుంటే అధికార యంత్రాంగం ఈ రాష్ట్రాన్ని పాలిస్తున్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు.

నలుగురి ప్రాణాలు పోతే గాని ఈ సర్కారు కళ్ళు తెరవదా అని ప్రశ్నించారు. అదీ నేను ఈ గ్రామానికి వస్తున్నానన్న సమాచారం తెలిసిన తర్వాతనే అధికార యంత్రాంగం ఇక్కడికి వచ్చి సర్వే పనులు చేసినట్టు తన దృష్టికి వచ్చిందని పేర్కొన్న ఆయన 'దిశ' దినపత్రికలో వచ్చిన కథనాన్ని గుర్తు చేశారు. ఏడాది ఓపిక పట్టండి.. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది.. గుండెగాం గ్రామానికి పునరావాసం కల్పించి గ్రామాన్ని అద్దంలా తీర్చిదిద్దుతామని గ్రామస్తులకు సంజయ్ అభయమిచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్‌లోనే ఉంటాడని.. ఇన్నేళ్లయినా ఇక్కడికి రాలేదు అంటే ఇంకా వస్తాడన్న భరోసా లేదని బీజేపీ అధికారంలోకి రాగానే మీ సమస్యలన్నీ తీరుస్తామని హామీ ఇచ్చారు.

ఢిల్లీ నిధులు కేసీఆర్ మెక్కుతున్నాడు.. అందుకే రైతులు గోసపడుతున్నారు: పత్తి రైతులతో బండి

కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదని తొండి వాదానికి దిగుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చించే దమ్ముందా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కేంద్రం ఉపాధి హామీ పథకం కింద కోట్ల రూపాయల నిధులు ఇస్తుంటే.. ఆ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. కేంద్రం 100 రోజుల పని దినాలు కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఉపాధి కూలీలు చెల్లించడం లేదని ధ్వజమెత్తారు. తమకు ఉపాధి కూలీలు సరిపోవడం లేదని రైతులు చెప్పడంతో పాటు తమకు ప్రతినెలా పింఛన్ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని గుండెగామ్ గ్రామ సమీపంలో రైతులు బండి సంజయ్‌ను కోరారు. ఈ సందర్భంగా ఆయన పత్తి రైతులతో ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రైతులు వ్యవసాయంలో తమకు గిట్టుబాటు కావడం లేదని ప్రతి ఏటా తీవ్రంగా నష్టపోతున్నామని తమ సమస్యలను సంజయ్ ముందు ఏకరువు పెట్టారు.

మీకు ఉపాధి హామీ నిధులు అందుతున్నాయా అని ప్రశ్నించగా రైతులు తమకు ఉపాధి పని దినాల ప్రకారం కూలి అందడం లేదని చెప్పడంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తుండడం వల్లనే రైతులు గోసపడుతున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో నిర్మిస్తున్న వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు కేంద్రం ఇస్తున్న ఉపాధి నిధులతో చేస్తున్నవేనని చెప్పారు. కేంద్రం ఇస్తున్న నిధులతో అభివృద్ధి చేసి తాను చేస్తున్నట్టు కేసీఆర్ నమ్మిస్తున్నాడని ఆరోపించారు. ఇలాంటి కారణాలతో గ్రామాల్లో రైతులకు ఉపాధి హామీ కూలీ డబ్బులు అందడం లేదని ఆరోపించారు. పాదయాత్రలో పార్లమెంటు సభ్యుడు సోయం బాపూరావు, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి పార్టీ నేతలు రామారావు పటేల్, మోహన్ రావు పటేల్ తదితరులు వెంట ఉన్నారు.

ఇవి కూడా చదవండి : కూతురు కోసం సిట్టింగ్ ఎమ్మెల్యేకు KCR షాక్.. Kavitha పోటీ అక్కడి నుంచేనా?

Next Story

Most Viewed