మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి

by Shiva Kumar |
మంత్రి కేటీఆర్ ను బర్తరఫ్ చేయాల్సిందే : టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
X

ఏలేటి వెంట్రుకతో సమానం.. ఒక్కడు పోతే వంద మంది పుట్టుకొస్తారు

దిశ ప్రతినిధి నిర్మల్: కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగుల పక్షాన పోరాటం కొనసాగిస్తూనే ఉందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టీ.ఎస్.పీ.ఎస్.సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సీఎం తనయుడు మంత్రి కేటీఆర్ హస్తం వందా శాతం ఉందని, ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరుద్యోగ సభలో ఆయన హాజరై ప్రసంగించారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ శ్రేణులతో పాటు నిరుద్యోగ యువతను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా ప్రసంగించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. 90 సీట్లను సాధించి తెలంగాణ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది సీట్లను కైవసం చేసుకునేలా కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు ఒక్కటిగా పని చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని దీన్ని తెలంగాణ సమాజం గుర్తించిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధమయ్యారని ఆయన అన్నారు. అదేవిధంగా టీ.ఎస్.పీ.ఎస్.సీ చైర్మన్ సభ్యులను కూడా వెంటనే పదవుల నుంచి తొలగించి ప్రస్తుత పాలక మండలిని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 30 లక్షల మంది నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ప్రశ్నాపత్రాల లీకేజీ కారణంగా అనేక కుటుంబాలు వారి పిల్లలు తీవ్రమైన మనోవేదనకు గురవుతున్నారని తెలిపారు. దరఖాస్తు చేసుకున్న 30 లక్షల మందికి ఒక్కొక్కరికి రూ.1.60 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.

ఏలేటి వెంట్రుకతో సమానం..

కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురించి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పట్టించుకునే అవసరం లేదని రేవంత్ రెడ్డి సూచించారు. పార్టీ నేతలు కార్యకర్తలు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి మహేశ్వర్ రెడ్డి పోయినంత మాత్రాన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. ఆయన ఒక వెంట్రుకతో సమానం అని రేవంత్ రెడ్డి ఘాటుగా వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్కడు పోతే మంది మంది పుట్టుకొస్తారని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది సీట్లను కాంగ్రెస్ కైవసం చేసుకోవడం ఖాయమన్నారు. సభలో మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ, గడ్డం వినోద్, రాంచంద్రారెడ్డి, డాక్టర్ మల్లు రవి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఆదిలాబాద్ జిల్లా నేతలు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, అర్జుమన్ జునేత్ ఇమ్రాన్ ఉల్లా, చోట అజర్, గండ్రత్ సుజాత సాజిద్ ఖాన్, గజేందర్, వెడ్మ బొజ్జు, డాక్టర్ అశోక్, తదితరులు పాల్గొన్నారు.

Next Story