ఈసారైనా భక్తులకు తిప్పలు తప్పేనా..

by Disha Web Desk 20 |
ఈసారైనా భక్తులకు తిప్పలు తప్పేనా..
X

దిశ, బాసర : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో దసరా నవరాత్రి మహోత్సవాల్లో అత్యంత ముఖ్యమైన దినం మూల నక్షత్రం. దుర్గామాత తొమ్మిది రూపాల్లో భాగంగా ఈరోజు చదువుల తల్లిగా దర్శనమిస్తారు. ఇంతటి ప్రాముఖ్యత గల మూల నక్షత్ర పర్వదినాన అమ్మవారి సన్నిధిలో చిన్నారులకు అక్షరాభ్యాస పూజలు జరిపించడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు.కానీ సరైన వసతులు ఏర్పాట్లు లేక భక్తులు తీవ్ర ఇబ్బందుల మధ్య పూజలు జరిపించుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు. ఈసారి 2వ తేదీన మూల నక్షత్రం ఉంది. ఎప్పటిలాగే ఈసారి కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. చిన్న చిన్న మార్పులు తప్ప చెప్పుకోదగ్గ స్థాయిలో ఏర్పాట్లు లేవని చెప్పవచ్చు. ఈ ఏడాది కూడా భక్తులకు కష్టాలు తప్పేలా లేవు.

కనీసం తాగునీరు దొరకని పరిస్థితి

ఇంత పెద్ద ఉత్సవాలలో భక్తులకు కనీసం తాగునీరు సౌకర్యం లేక కష్ట పడుతున్నారు. రెండు, మూడు చోట్ల చిన్న వాటర్ కూలర్లు ఉంచి ఆలయ అధికారులు చేతులు దులుపుకున్నారు. అన్నదాన సత్రంలో అయితే చేతులు కడిగే నీటిని పైపు ద్వారా టాకిలో నింపి వాటిని తాగడానికి సరఫరా చేస్తున్నారు. ఇక ఆలయంలో కూడా భక్తులకు తాగుదామంటే తాగునీరు దొరికే వసతి ఒక్కటి అంటే ఒక్కటి లేదు. ఒక్కో దగ్గర ఉన్నా తాగడానికి గ్లాసులు ఏర్పాటు చేయలేదు. కొందరు భక్తులు కూలర్ వద్ద గ్లాస్ లేకపోవడంతో చేతితో నీటిని తాగుతున్నారు. ఉత్సవాలు ప్రారంభం అయి నాలుగు రోజులు గడుస్తున్నా కనీసం తాత్కాలిక ఏర్పాట్లు చేయడం లేదు.

ఏర్పాట్లలో లోపాలు

ఉత్సవాల సందర్భంగా తాత్కాలిక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీటితో పాటు మధ్యలో అత్యవసరం ఏర్పడితే భక్తులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. గంటల తరబడి నిలుచునే భక్తులు కూర్చుందామంటే ఏర్పాట్లు చేయలేదు. ఈసారి వీఐపీల కోసం క్యూలైన్లు అక్షరాభ్యాస పూజల కోసం గతం కంటే అదనపు ఏర్పాటు చేసిన అధికారులు, సాధారణ భక్తుల విషయాలను మాత్రం గాలికి వదిలేశారు.

సమస్యలపై దృష్టి పెట్టని అధికారులు

గత అనుభవాలను ఆలయ అధికారులు మర్చిపోయినట్టున్నారు. గత నవరాత్రి ఉత్సవాల్లో వసంత పంచమి వేడుకల సమయంలో భక్తులకు ఏర్పడిన అసౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేసినట్లు లేరు. అదనపు క్యూలైన్లు వివిధ దిశల నుంచి ఆలయంలోకి ఏర్పాట్లు చేసిన అధికారులు, పూజలు, దర్శనం త్వరగా జరిగే కోణంలో ఆలోచన చేయలేదు. గతంలో మూడు చోట్ల అక్షరాభ్యాస పూజలు జరిగితే ఈసారి నాలుగు చోట్ల నిర్వహించనున్నారు. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా భక్తులకు ఇబ్బందులు తప్పవని పలువురు అంటున్నారు.



Next Story

Most Viewed