మళ్లీ నవంబర్ లో వస్తా... మంత్రి కేటీఆర్

by Disha Web Desk 20 |
మళ్లీ నవంబర్ లో వస్తా... మంత్రి కేటీఆర్
X

దిశ, బాసర : బాసర ట్రిపుల్ ఐటిలో మంత్రి కేటీఆర్ విద్యార్థులతో సంభాషించారు. ప్రస్తుతం బాసర ట్రిపుల్ ఐటీలో ఉన్న సమస్యలు, వివిధ అంశాలపైన తనకు పూర్తి సమాచారం ఉందని ఆయన తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీని అభివృద్ధి చేస్తానని అక్కడి విద్యార్థులకు మరిన్ని ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు చేపడతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం ఐటీ ప్రాంగణంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. ముఖ్యమంత్రి సహకారంతో, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో సమన్వయం చేసుకొని ట్రిపుల్ ఐటీని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.

ట్రిపుల్ ఐటీలో టీ హబ్ సెంటర్ ఏర్పాటుతోపాటు, మినీ స్టేడియం, అధునాతన కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేస్తానన్నారు. డిజిటల్ ఇన్నోవేషన్ ల్యాబ్, విద్యార్థులకు లాప్టాప్ లు అందజేయడం వంటి అంశాలపైన తాను పూర్తి బాధ్యత తీసుకొంటాన్నారు. విద్యార్థులతో తన హాస్టల్ అనుభవాలను, విద్యార్థిగా తన కేటీఆర్ అనుభవాలను పంచుకున్నారు. కోర్సులు పూర్తయిన తర్వాత ఇన్నోవేషన్ వంటి రంగాల్లో విజయం సాధించేందుకు విద్యార్థులు ఇప్పటినుంచి సిద్ధం కావాలని కోరారు.

మళ్లీ నవంబర్ లో విద్యార్థులకు ల్యాప్ ట్యాప్ లు ఇవ్వడానికి వస్తానని ఆయన తెలిపారు. అప్పటివరకు ఆడిటోరియంను మరింత అభివృద్ధి చేయాలని కోరారు. కొత్త మౌలిక వసతులు కల్పించే బాద్యత తాను తీసుకుంటానని అన్నారు. పిల్లలను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేయాలని కేటీఆర్ అన్నారు. విద్యార్థులు తయారుచేసిన ఉత్పత్తులతో ప్రతీ సంవత్సరం వారం రోజులు ఇన్నోవేషన్ వారోత్సవాలు జరిపించాలని తెలిపారు. అమెరికాలోని ఎంఐటీ లాగా బాసర ట్రిపుల్ ఐటీ మారాలని అన్నారు. ఎంఐటీ ల్యాబ్ నుంచి వచ్చిన కంపెనీలు అంతర్జాతీయ ఖ్యాతి పొందాయన్నారు.

పరిశోధనలే నవీన ఆవిష్కరణలకు ఊతం ఇస్తాయన్నారు. ఆవిష్కరణల నుంచి కంపెనీలు పుడతాయని, ఆ కంపెనీల నుంచి ఉద్యోగాలు, సంపద పుడతాయన్నారు. 3 కోట్ల రూపాయలతో మిని స్టేడియం ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. మీ యూనివర్సిటీని మీరే బాగా చూసుకోవాలని చెప్పి తన జపాన్ అనుభవాన్ని విద్యార్థులతో పంచుకున్నారు. క్యాంపస్ మేయింటనెన్స్ అనేది సమష్టి బాధ్యత అని, బాసర ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలన్నారు.

సబిత ఇంద్రారెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని తెలిపారు. ఉద్యమస్పూర్తితో కలిసి పనిచేసి దీన్ని మోడల్ క్యాంపస్ గా మారుద్దాం అని పిలుపునిచ్చారు. ఆందోళన చేస్తున్నప్పుడు రోజు పేపర్లు, టీవీల్లో చూశానని, రాజకీయాలకు అతీతంగా స్టూడెంట్ గవర్నెన్స్ కౌన్సిల్ సహకారంతో మీ సమస్యలను మీరు పరిష్కరించుకున్నారన్నారు. విద్యార్థులు ఎంచుకున్న పద్దతి తనకి నచ్చింది, గాంధీగారి సత్యాగ్రహ పద్దతిలో శాంతియుతంగా వానలో కూడా బయట కూర్చోని కొట్లాడిన పద్దతి నాకు చాలా నచ్చిందన్నారు.

కోవిడ్ తో విద్యావ్యవస్థ అతలాకుతలం అయింది. ఆ రెండేళ్లు క్యాంపస్ బంద్ అయింది. మళ్లీ పట్టాల మీదికి ఎక్కడానికి కొంత టైం పడుతుందని తెలిపారు. బాసర ట్రిపుల్ ఐటీలో సీటు ఇప్పియ్యాలని నా రాజకీయ జీవితంలో ఎన్నో పైరవీలు వచ్చాయి. కాని మెరిట్ ఉంటేనే సీటు వస్తుందని చెప్పానని తెలిపారు. అమెరికా నుంచి ప్రపంచాన్ని ఆకర్షించే ఎన్నో ఆవిష్కరణలు వస్తున్నాయి. మనం గానుగ ఎద్దులలాగా పనిచేద్దమా? ఇలాంటివి కొత్తవి ఏదన్నా కనుకొందామా? అన్నారు.

ఈ సమావేశంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి. త్రిబుల్ ఐటీ రాష్ట్రంలోని గ్రామీణ పేద విద్యార్థుల పాలిట ఒక వరమని ఇక్కడ చదివితే జీవితాల్లో స్థిరపడతామన్న బలమైన విశ్వాసం తల్లిదండ్రులకు ఉన్నదని తెలిపారు. విద్యార్థులు తమ సమస్యల కోసం ఆందోళన చేసిన సమయంలో పలుమార్లు వారితో మాట్లాడమని, వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం వాటి పరిష్కారం కోసం వెంటనే చర్యలు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

గత మూడు నెలల కాలంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో గుణాత్మకమైన మార్పు కనిపిస్తున్నదని తెలిపారు. భవిష్యత్తులోనూ నిబద్ధతతో విద్యార్థులకు మరిన్ని ఉన్నత ప్రమాణాల విద్య అందించడంతోపాటు క్యాంపస్ ప్రాంగణంలో మౌలిక వసతుల కల్పనను ఒక ప్రాధాన్యత అంశంగా తీసుకుంటామని తెలిపారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed