- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇల్లున్నవారికి ఇంకొక ఇల్లు.. ఇల్లులేనివారికి హామీల్లోనే ఇల్లు..!

దిశ, కాగజ్నగర్ రూరల్: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఇందిరమ్మ ఇళ్లు' పథకం లక్ష్యం.. నిరాశ్రయులు , ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు భద్రమైన గృహాలను అందించడం.అయితే, సిర్పూర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో ఈ పథకం అసలైన గమ్యాన్ని త్రుటిలో తప్పిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల విడుదలైన తొలి విడత లబ్ధిదారుల జాబితాలో పంచాయతీ కమిటీ సభ్యుల కుటుంబసభ్యులు వంటి అర్హత లేని వ్యక్తులు ఎంపికై ఉండటంతో అసలైన నిరుపేదలకు గృహ కల నెరవేరకుండా పోయిందని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాప్రతినిధులు , కమిటీ సభ్యులు ప్రత్యక్ష ప్రమేయంతో లబ్ధిదారుల ఎంపికను వక్రీకరించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పారదర్శకత లేకుండా జరిగిన ఎంపిక ప్రక్రియలో అసలైన అర్హులను నిర్లక్ష్యం చేయడం వల్ల, నిజమైన అవసరమైనవారికి తీవ్ర నష్టం జరుగుతోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల వెల్లడించినట్లుగా, ఇందిరమ్మ ఇళ్ల ఉద్దేశం అసలైన నిరుపేదలకు గృహాలు కల్పించడం. వాస్తవ సర్వే ఆధారంగా లబ్ధిదారుల ఎంపిక జరగాలని స్పష్టం చేసినా, నేలమీద జరుగుతున్న పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. కమిటీల సిఫార్సుల ఆధారంగా మాత్రమే ఎంపికలు జరుగుతున్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు.
ప్రస్తుత విధానాన్ని కొనసాగిస్తే పథకం అసలు ఉద్దేశం తారుమారు అవుతుందని ప్రజలు హెచ్చరిస్తున్నారు. జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు వెంటనే దొరుకుతున్న అవకతవకలపై స్పందించి, సర్వే ప్రక్రియను పునఃసమీక్షించి, అర్హులైన వారికి గృహాలు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇందిరమ్మ ఇళ్ల పథకం ముఖ్యాంశాలు:
భూమిలేని కార్మికులు, పేద రైతులు, గిరిజనుల కోసం ప్రత్యేక లక్ష్యం.
ఒక్కొక్క గృహానికి రూ. 5 లక్షల వరకు ఆర్థిక సహాయం.
కనీసం 400 చదరపు అడుగుల గృహ నిర్మాణం (వంటగది, టాయిలెట్ సదుపాయాలతో).
సామాజిక సమ్మిళితతకు మద్దతు, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటు.