భయం గుప్పిట్లో మక్క సాగు రైతులు...!!

by Disha Web Desk 20 |
భయం గుప్పిట్లో మక్క సాగు రైతులు...!!
X

దిశ, కుబీర్ : చేతికొచ్చిన మొక్కజొన్న పంటకు తరచూ అగ్ని ప్రమాదాలు జరుగుతుండడంతో, భయంతో పంటను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్నారు రైతులు. పంటను సాగు చేయడం ఒక వంతు అయితే, చేతికి వచ్చిన పంట ఇంటికి చేరడం మరో సమస్యగా మారింది. కొన్ని రోజులుగా ఎండలు భగభగ మండిపోవడంతో, అగ్గి భయంతో మొక్కజొన్న సాగు రైతులు భయభయంగా కాలం వెళ్లదీస్తున్నారు. కుబీర్ మండలంలో పలు గ్రామాల్లో ఇటీవల కోసిన మొక్కజొన్న పంట అగ్నిప్రమాదానికి గురైంది. దీంతో రైతులు లక్షల్లో నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుప్టి, కస్ర, గ్రామాల్లో ఒకే రోజున రెండు చోట్ల ప్రమాదాలు జరిగాయి. దీంతో బాధిత రైతులు తీవ్రంగా నష్టపోవలసిన పరిస్థితి ఏర్పడింది.

సాగు సమయంలో అడవి పందుల బెడదలతో కంటి మీద నిద్ర లేకుండా కాపాడుకుంటే, పంట చేతికి వచ్చే సమయంలో అగ్నిప్రమాదాలు జరుగుతుండడంతో ఆందోళన చెందుతున్నారు. క్రిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలతోనూ, ప్రమాదవశాత్తుతో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు పక్కన ఉన్న పంటచేళ్ళ రైతులు బాటసారుల వల్ల, వాహనాల రాకపోకల వల్ల, పోకిరిలు, ఎప్పుడు ప్రమాదం ముంచుకొస్తుందని భయపడుతున్నారు. మండలంలో గత సంవత్సరం అగ్ని ప్రమాదాలు జరగడంతో రైతులు నష్టపోయారు. వంట పండిచడం ఒక వంతైతే, చేతికి వచ్చిన పంట ఇంటికి వచ్చేదాకా నమ్మకం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. భయంతో పంటచేళ్ళ చుట్టూ రక్షణ కోసం కాపలా కాస్తున్నారు.

Next Story

Most Viewed