దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతోంది..

by Disha Web Desk 20 |
దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతోంది..
X

దిశ, తాండూర్ : బీజేపీ ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో ప్రజాస్వామ్యం పై దాడి జరుగుతున్నదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. పిఫుల్స్ మార్చ్ కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి ఆసిఫాబాద్ పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన బీజేపీ పై మండిపడ్డారు. మోదీ 8 ఏళ్ల పాలనలో ఆదాని అపర కుబేరుడయ్యాడని విమర్శించారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పై అక్రమ కేసుపెట్టి సూరత్ కోర్టులో జైలు శిక్ష పడేలా చేసి, శిక్ష వేసిందన్న సాకుతో 2 సంవత్సరాల పాటు పార్లమెంటు నుంచి బహిష్కరణ చేసి మోడీ కక్ష సాధింపు చర్యకు పాల్పడ్డారన్నారు. దేశ సంపదను ప్రధాని కొన్ని క్యాపిటలిస్ట్ లకు దోచిపెడుతున్నడని ఆరోపించారు.

ఆదానికి దోచుకుంటున్న సంపదపై గొంతెత్తి ప్రశ్నించిన రాహుల్ గాంధీని పార్లమెంటుకు రాకుండా అడ్డుకోవడానికే బీజేపీ ప్రభుత్వం బహిష్కరణ కుట్రకు పాల్పడిందన్నారు. రాహుల్ గాంధీ చెబుతున్నది నిజమేనని అమెరికాకు చెందిన హిండేన్ బర్గ్ సంస్థ ఆదాని దోపిడీ చేసిన ఆర్థిక నేరం గుట్టును రట్టు చేసి ఆదానీ దేశానే కాదు, ప్రపంచాన్ని సైతం మోసం చేశాడని బయటపెట్టిందన్నారు. దేశంలో హిందూ, ముస్లిం విభజన పేరిట బీజేపీ మత రాజకీయాలు చేస్తోందన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో అసిఫాబాద్ జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందన్నారు. గిరిజన బంధు అమలు చేయాలని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు, పిల్ల కాల్వలు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

9 ఏళ్లలో కేసీఆర్ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని, కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ళు దర్శనమిస్తున్నాయన్నారు. ఆడ బిడ్డల సొమ్ము తింటున్న కేసీఆర్ కు వారి శాపం తగులుతుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ కొందరు నాయకులు సభ సందర్భంగా గొడవ చేసి పార్టీ పరువు తీయడం సరికాదని కన్నీళ్లు పెట్టుకున్నారు. అసిఫాబాద్ ప్రాతం పార్టీ బలోపేతంకార్మికుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశానన్నారు. రాబోయే ఎన్నికల్లో కూడా అసిఫాబాద్ నుండి కాంగ్రెస్ అభ్యర్ధి ని గెలిపించుకుని తిరుతానన్నారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు శివప్రసాద్, సురేఖ నాయకులు గణేష్ రాథోడ్ పాల్గొన్నారు.


Next Story