చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తి దాయకం

by Sridhar Babu |

భూపోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని, దొరల పాలనను అంతమొందించడానికి ఆమె చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తినిస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు.

చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తి దాయకం
X

దిశ, ఉట్నూర్ : భూపోరాటానికి నాంది పలికిన ధీరవనిత చాకలి ఐలమ్మ అని, దొరల పాలనను అంతమొందించడానికి ఆమె చేసిన పోరాటం మనందరికీ స్ఫూర్తినిస్తోందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. మంగళవారం ఉట్నూరు మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ధీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూస్వాములకు, దొరలకు వ్యతిరేకంగా చాకలి ఐలమ్మ నిరంతరం పోరాడారని, ఆ ధీరవనిత పోరాటాన్ని మహిళలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

ఆ మహనీయురాలి అడుగు జాడల్లో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. త్వరలో ఉట్నూర్ లో చాకలి ఐలమ్మ విగ్రహ ఏర్పాటుకు తన వంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు. రజక సమాజానికి అండగా ఉంటామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్బండ వర్గాల ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తోందన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు. అనంతరం రజక సంఘం సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో లక్కారం మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Next Story