ఎట్టకేలకు బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కు మహర్దశ..

by Disha Web Desk 20 |
ఎట్టకేలకు బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ కు మహర్దశ..
X

దిశ, బెల్లంపల్లి : దశాబ్దాలుగా చిరు వ్యాపారుల కల నెరవేరబోతుంది. ఎట్టకేలకు బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ భవన సముదాయం నిర్మాణరూపం దాల్చింది. చిరకాల కోరిక నిజం కానున్న నేపథ్యంలో వ్యాపారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. బెల్లంపల్లి కూరగాయల మార్కెట్ భవనం జిల్లాలోనే మరెఎక్కడాలేని విధంగా ఆధునిక హంగులతో నిర్మాణం జరుగుతుంది. చిరు వ్యాపారులు మార్కెట్ సముదాయం కోసం దశాబ్దాలుగా ప్రతి ప్రజాప్రతినిధితో మొరపెట్టుకుంటూనే ఉంటున్నారు.

అయినా వారి విన్నపాలు, విజ్ఞప్తులను పట్టించుకున్న వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలో ఇప్పటిలాగే ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు సైతం తమ బాధలను వ్యాపారులు విన్నవించారు. బెల్లంపల్లి మార్కెట్లో చిరు వ్యాపారులు పడుతున్న బాధలు, కొనుగోలుదారుల అవస్థలను స్వయంగా చూసిన ఆయన మార్కెట్ భవన నిర్మాణానికి మాటిచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రూ. ఐదు కోట్లతో నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. కనీవిని ఎరుగని రీతిలో బెల్లంపల్లిలో కూరగాయలమార్కెట్ భవనం రూపుదిద్దుకుంటుంది.

పైన మాంసం విక్రయాలు.. కింద కూరగాయలు..

బెల్లంపల్లిలో కూరగాయల మార్కెట్ సముదాయం అటు వ్యాపారస్తులకు ఇటు కొనుగోలుదారులకు అసౌకర్యం తలెత్తకుండా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రెండంతస్తుల మార్కెట్ భవనం నిర్మాణం జరుగుతుంది. పైన మాంసం, ఫిష్, చికెన్ విక్రయాలు జరుగుతాయి. గ్రౌండ్ ఫ్లోర్లో కూరగాయల విక్రయాల కోసం గదుల నిర్మాణాలు జరుగుతున్నాయి. అన్ని విభాగాలు ఒకే దగ్గర ఉండటం వల్ల కొనుగోలుదారులకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో వేరువేరుగా మార్కెట్ గదులు ఏర్పాటు చేస్తున్నారు. విశాలమైన స్థలములో మిశ్రమమార్కెట్ కాంప్లెక్స్ కు అంకురార్పరణ జరిగింది. నిర్మాణ పనులు సైతం వేగంగా జరుగుతున్నాయి. వ్యాపారులు సైతం మార్కెట్ భవనం కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

నూతన కూరగాయల మార్కెట్ భవనం కోసం ఇంతకాలం ఎదురుచూసిన చిరు వ్యాపారస్తుల కలసాకారనికి ఎంతో దూరం లేదు. మార్కెట్ భవన నిర్మాణ పనులు తుది రూపానికి వచ్చాయి. శీగ్రగతిన మార్కెట్ భవన నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. వ్యాపారస్తులకు సరిపడా గదులను నిర్మిస్తున్నారు. ప్రతి ఒక్కరికీ విక్రయ కేంద్రం సదుపాయం లక్ష్యంతో మార్కెట్ భవన నిర్మాణం రూపకల్పన చేశారు. చిరువ్యాపారులు దశాబ్దాలుగా చిన్నచిన్న షెడ్లు వేసుకుని అసౌకర్యాల నడుమ ఇంతకాలం విక్రయాలు చేశారు. వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ మనుగడ సాగించిన చిరు వ్యాపారుల బాధలకు ఇకచెక్ పడనుంది. ప్రభుత్వమే ఉచితంగా వ్యాపారస్తులకు మార్కెట్ భవనం నిర్మించి విక్రయ కేంద్రాలను అంకితం చేయనుంది. ఈ మహర్దశ వారిని వరించడానికి ఇంకేంతోదూరంలేదు.



Next Story

Most Viewed