మావోయిస్టులకు సహకరించొద్దు - ఏసీపీ ఎడ్ల మహేష్

by Disha Web Desk 20 |
మావోయిస్టులకు సహకరించొద్దు - ఏసీపీ ఎడ్ల మహేష్
X

దిశ, బెల్లంపల్లి : మావోయిస్టులకు ప్రజలు ఎటువంటి సహకారం అందించవద్దని బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్ కోరారు. బెల్లంపల్లి పట్టణం కన్నాల బస్తీలో గల మదునన్ననగర్ లో శనివారం సాయంత్రం పోలీసులు కార్టెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ 30 ఏళ్ల క్రితం బెల్లంపల్లి పేరు చెబితేనే గుండె దడ పుట్టేదని అన్నారు. నాడు ఇక్కడ సీకాస, పీపుల్స్ వార్ నక్సలైట్ల కార్యకలాపాలు ఉండేవన్నారు. వీరి కార్యకలాపాల మూలంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని అన్నారు. కొత్త వ్యక్తులు ఈ బస్తీలోకి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. నాడు నక్సలైట్ల కార్యకలాపాల మూలంగా చాలామంది నక్సలైట్లు, పోలీసులు ఎన్కౌంటర్లలో చనిపోయారని ఏసీపీ తెలిపారు.

మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో కన్నాల బస్తీకి చెందిన కటకం సుదర్శన్ పని చేస్తున్నారని పేర్కొన్నారు. నాటి పరిస్థితులు బెల్లంపల్లి పట్టణానికి రానివొద్దన్నారు. చత్తీస్ ఘడ్, మహారాష్ట్రల నుంచి మావోయిస్ట్ లు ఇక్కడకు వచ్చే పరిస్తితి ఉందన్నారు. ఇక్కడ మళ్ళీ నక్సల్ కార్యకలాపాలు చేపట్టాలని ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఇల్లిల్లు తనిఖీ చేసి ఎలాంటి ధృవ పత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీన పరచుకున్నారు. కార్డెన్ సెర్చ్ లో బెల్లంపల్లి రూరల్ సీఐ కోట బాబూరావు, వన్ టౌన్ ఎస్ఎస్ఓ ముస్కరాజు, తాండూర్ సీఐ కె జగదీష్, బెల్లంపల్లి పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని ఎస్సై లు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Next Story