రాహుల్ ప్రధాని అయితే.. అన్నీ క్షణాల్లో తెచ్చుకుంటాం: ఆది శ్రీనివాస్

by Vemula.Srinu Prasad |

పొలిటిక‌ల్ డైవ‌ర్షన్ కోస‌మే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాల‌ని సీఎంకి బీజేపీ అధ్యక్షుడు రామ‌చంద్ర రావు లేఖ రాశారని, రాహుల్ గాంధీని క‌లిస్తే రామ‌చంద్ర రావుకు ఒరిగేది ఏమీ లేదని, ఆయనకు పొలిటిక‌ల్ డైవ‌ర్షన్ మాత్రమే తెలుసని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు..

రాహుల్ ప్రధాని అయితే.. అన్నీ క్షణాల్లో తెచ్చుకుంటాం: ఆది శ్రీనివాస్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పొలిటిక‌ల్ డైవ‌ర్షన్ కోస‌మే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాల‌ని సీఎంకి బీజేపీ అధ్యక్షుడు రామ‌చంద్ర రావు లేఖ రాశారని, రాహుల్ గాంధీని క‌లిస్తే రామ‌చంద్ర రావుకు ఒరిగేది ఏమీ లేదని, ఆయనకు పొలిటిక‌ల్ డైవ‌ర్షన్ మాత్రమే తెలుసని ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. సోమవారం సీఎల్పీ మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామ‌చంద్ర రావుకి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తే ముందు ఆయ‌న‌ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో చూసుకోవాలని, ముందు ప్రధాని మోదీ మాకు అపాయింట్మెంట్ ఇస్తే బీజేపీ ఇచ్చిన హామీలు ఏమ‌య్యాయో అడుగుతామని ఆది శ్రీనివాస్ తెలిపారు. మీకు రాహుల్ గాంధీని క‌ల‌వాల‌ని ఉంటే ప్రధాని మోదీతో రాజీనామా చేసి రాహుల్ ను ప్రధాని చేయండి అని, రాహుల్ గాంధీ ప్రధాని అయితే తెలంగాణ‌కు రావాల్సిన‌వి క్షణాల్లో తెచ్చుకుంటామన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే మెట్రో విస్తర‌ణ‌, త్రిబుల్ ఆర్ అనుమ‌తులు, ఎరువుల కోటా, బ‌య్యారం ఉక్కు, రైతులు పండించిన మొత్తం పంట‌ను కేంద్రం కొనుగోలు చేసేలా చేస్తామని ఆది శ్రీనివాస్ తెలిపారు.

కేంద్ర మంత్రి అశ్విణి వైష్ణవ్ ను క‌లిపించి మెట్రో అప్పు పైన తేల్చాల‌ని రేవంత్ రెడ్డి కిష‌న్ రెడ్డికి లేఖ రాశారని, ఐఆర్ఎఫ్ సి ద‌గ్గర ఉన్న లోన్ డ‌బ్బును మెట్రోకు వెంట‌నే రిలీజ్ చేయాల‌ని మాత్రమే తమ సీఎం అడుగుతున్నారని ఆయన చెప్పారు. సీఎం వ్యక్తిగ‌తంగా ఏమీ అడ‌గ‌లేదని, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, బీజేపీకి చెందిన ఆరుగురు ఎంపీలు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండి కేంద్రాన్ని నిల‌దీయ‌డం లేదని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ నుంచి లోన్ ఎందుకు విడుద‌ల చేయ‌డం లేదని బీజేపీ నాయకులు ఎందుకు మాట్లాడ‌టం లేదని ఆయన ప్రశ్నించారు. కేంద్రం మ‌ద్దతు ధ‌ర‌లు ప్రక‌టించి చేతులు దులుపుకుంటోందని, ధాన్యం కొనుగోళ్ల పైన బీఆర్ఎస్ పార్టీ కేంద్రంపైన ఒత్తిడి తీసుకురావ‌డం లేదని, బీజేపీ, బీఆర్ఎస్ ల‌కు తెలంగాణ ప్రజ‌ల ప‌ట్ల చిత్తశుద్ది లేదన్నారు.

రామగుండం ఎరువుల క‌ర్మాగారంలో ఉత్పత్తి అయ్యే ఎరువుల‌న్ని తెలంగాణ‌కే కేటాయించాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల కోసం ఫాంహౌస్ లో ఉన్న కేసీఆర్ క‌నీసం కేంద్రానికి లేఖ కూడా రాయ‌లేక‌పోతున్నాడని, మోదీ, బీజేపీ పేరు ఉచ్చరించానికి కూడా కేటీఆర్, హ‌రీష్ రావు ధైర్యం చేయ‌డం లేదని ఆయన మండిపడ్డారు. రైతులు పండించిన పంట‌లో యాభై శాతం కూడా కేంద్రం కొన‌డం లేదని, తమ ప్రభుత్వం రైతుల పండించిన 80 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ఆది శ్రీనివాస్ తెలిపారు.

తెలంగాణ ప్రజ‌ల కోసం గ‌ళ‌మెత్తడానికి బీజేపీ, బీఆర్ఎస్ కు నోరు రావ‌డం లేదని, సీఎం రేవంత్ రెడ్డి పైన మాత్రం అడ్డగోలుగా మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ప్రజ‌ల ప్రయోజ‌నాల కోసం రామ‌చంద్రరావు ప్రధాని మోదీకి లేఖ‌లు రాయాలని, మెట్రో విస్తర‌ణ చేయాలని, త్రిబుల్ ఆర్ కు అనుమ‌తులు ఇవ్వాల‌ని, తెలంగాణకు అవ‌స‌ర‌మైన ఎరువులు అందివ్వాల‌ని బీజేపీ ప్రధాని మోదీకి లేఖ‌లు రాయాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బీజేపీ ప్రభుత్వం ఎక్కడైనా రుణ‌మాఫీ చేసిందా ? తమ మ‌న్మోహ‌న్ సింగ్ ప్రభుత్వం రూ. 70 వేల కోట్ల రుణ‌మాఫీ చేసింది, తమ ప్రభుత్వం 20 వేల కోట్ల రైతు రుణ‌మాఫీ చేసిందని ఆయన వెల్లడించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికంగా అప్పుల పాలు చేస్తుంటే బీజేపీ ఎందుకు అలాయ్ బ‌లాయ్ చేసుకుందని, కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నార‌ని ఆయ‌న కూతురు క‌విత‌నే చెపుతోందని ఆది శ్రీనివాస్ తెలిపారు.

హైద‌రాబాద్ న‌గ‌ర ప్రజ‌లు రేవంత్ రెడ్డి వెంట నిల‌బ‌డ‌తార‌ని బీఆర్ఎస్ భ‌య‌ప‌డుతోందని, బీఆర్ఎస్, బీజేపీ ఇద్దరు క‌లిసి అడ్డుకుంటున్న తీరును ప్రజ‌ల‌కు వివ‌రిస్తామన్నారు. భూపాల‌ప‌ల్లి డీటీఓ మర‌ణం అత్యంత బాధాక‌రమని ఆది శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. అన్నింటిని రాజ‌కీయం చేయ‌డం హ‌రీష్ రావుకు మంచిది కాదని ఆయన హితవు పలికారు.

Next Story