పేద రైతుల భూములను లాక్కుంటే ఊరుకునేది లేదు : బీఆర్‌ఎస్ నేత

by Batti.Sumithra |

డ్యాపూర్ ఉమ్మడి గ్రామంలో పేద రైతులు 40 ఏళ్లుగా సాగు చేస్తున్న అసైన్డ్ భూములను ప్రభుత్వం నోటీసులు లేకుండా బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం దారుణమని బీఆర్‌ఎస్ మండల మాజీ సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు నూనె కుమార్ ఖండించారు.

పేద రైతుల భూములను లాక్కుంటే ఊరుకునేది లేదు : బీఆర్‌ఎస్ నేత
X

దిశ, ముత్తారం : దడ్యాపూర్ ఉమ్మడి గ్రామానికి చెందిన పేద రైతులు గత 40 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న అసైన్డ్ భూములను ప్రభుత్వం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, కారణాలు వెల్లడించకుండా బలవంతంగా స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించడం దారుణమని బీఆర్‌ఎస్ మండల మాజీ సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు నూనె కుమార్ తీవ్రంగా ఖండించారు. సోమవారం దడ్యాపూర్‌లోని సర్వే నంబర్లు 144, 145 పరిధిలో ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో భాగంగా రైతులు భూముల్లోకి వెళ్లకుండా చుట్టూ ట్రెంచ్ తవ్వి అడ్డుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పేద రైతులు ఈ భూములనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని, గత ప్రభుత్వాల హయాంలోనే ఈ భూములకు విద్యుత్ స్తంభాలు, వ్యవసాయ బావులు వంటి సౌకర్యాలు కల్పించారని గుర్తు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు రైతులు కష్టపడి పంటలు పండిస్తూ జీవనోపాధి పొందుతున్నారని తెలిపారు.

రత్నాపూర్‌లో ఒక న్యాయం.. దడ్యాపూర్‌లో మరో న్యాయమా ?

రత్నాపూర్‌లో ఫ్యాక్టరీ నిర్మాణం కోసం సేకరించిన అసైన్డ్ భూములకు ప్రభుత్వం చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించిందని, అక్కడ రైతులకు న్యాయం చేసిన ప్రభుత్వం దడ్యాపూర్ రైతుల విషయంలో మాత్రం భిన్నంగా వ్యవహరించడం సరికాదని నూనె కుమార్ విమర్శించారు. దడ్యాపూర్‌లో రైతుల నుంచి భూములు తీసుకోవాలంటే ముందుగా పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించి, ఆ భూముల్లో ఏ ప్రాజెక్టు లేదా నిర్మాణం చేపట్టబోతున్నారో ప్రజలకు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రైతుల హక్కులను కాలరాసే బీఆర్‌ఎస్ పార్టీ సహించదని, పేద రైతుల భూములను లాక్కుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దడ్యాపూర్ మాజీ సర్పంచ్ గాదం స్రవంతి శ్రీనివాస్, మాజీ ఎంపీటీసీ రామగాళ్ల పోచమ్మ మధుకర్, ముత్తారం మండల బీఆర్‌ఎస్ పార్టీ అధికార ప్రతినిధి తిత్తుల శ్రీనివాస్, జంగ స్వామి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Next Story