ఫామ్‌హౌస్‌లో వరుస ప్రమాదాలు.. గులాబీ బాస్ సంచలన నిర్ణయం!

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-15 13:16:33  IST  )

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) అన్ని విషయాల్లోనూ అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తుంటారు.

ఫామ్‌హౌస్‌లో వరుస ప్రమాదాలు.. గులాబీ బాస్ సంచలన నిర్ణయం!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ (KCR) అన్ని విషయాల్లోనూ అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తుంటారు. తెలంగాణ సెక్రటేరియట్‌ నుంచి మొదలు సీఎం క్యాంపు కార్యాలయం వరకు ఆయన పక్కాగా వాస్తు ఫాలో అవుతూ.. మార్పులు, చేర్పులు చేసిన విషయం అందరికీ విదితమే. అయితే, 2024, డిసెంబర్ 7న ఎర్రవల్లి ఫాం హౌస్‌లోని బాత్‌రూంలో ఆయన కాలుజారి పడిపోగా.. తుంటి ఎముక విరిగింది. దీంతో కేసీఆర్‌కు సోమాజిగూడ యశోదా ఆసుపత్రి వైద్యులు శస్త్ర చికిత్స చేశారు. దాదాపు 8 నెలల అనంతరం గులాబీ బాస్ ఫుల్‌గా రికవర్ అయిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఈనెల 10న ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లిన జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, కేసీఆర్ పడిన బాత్‌రూంలోనే కాలుజారీ పడిపోగా.. కాలి ఎముక విరిగింది. దీంతో హుటాహుటిని ఆయనను ఆసుపత్రికి తరలించాగా.. వైద్యులు పల్లా కాలుకు సర్జరీ చేశారు.

ఈ నేపథ్యంలోనే ఫామ్‌హౌస్‌లో వరుస ప్రమాదాలు కేసీఆర్‌ను తీవ్రంగా కలవర పెడుతున్నాయి. దీంతో ఆయన ఫామ్‌హౌస్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. తాను ప్రమాదానికి గురైన బాత్‌రూంలో మార్పులు చేపట్టాలని చెప్పినట్లుగా సమాచారం. ప్రస్తుతం స్మూత్‌గా ఉన్న టైల్స్ స్థానంలో.. కాలుకు పట్టు ఉండేలా గరుకైన టైల్స్ లేదా బండలు వేయాలని ఆదేశించినట్లుగా తెలుస్తోంది. కాగా, గత రెండు రోజులుగా కేసీఆర్ ఫామ్‌ హౌస్‌కు దూరంగా ఉన్నారు. ఏఐజీ ఆసుపత్రి (AIG Hospital)లో వైద్య పరీక్షల కోసం వెళ్లిన ఆయన హైదరాబాద్‌ (Hyderabad)లోని నందీ నగర్ (Nandi Nagar) నివాసంలోనే ఉండిపోయారు. అయితే, బాత్‌రూంలో మార్పులు, చేర్పుల విషయంలో ఏ నిర్ణయం అయినా.. కేసీఆర్ వచ్చాకే ఉంటుందని ఫామ్ హౌస్ వర్గాలు తెలిపాయి.

Next Story