ఓయూ విద్యార్థులకు భారీ షాక్.. భారీగా అకడమిక్ సేవల ఛార్జీల పెంపు

by Malleboina Mahesh |

ఉస్మానియా యూనివర్సిటీలో అకడమిక్ ఫీజుల భారం.. సేవల ఛార్జీలు 20% నుండి 100% వరకు పెంపు.. యూజీ, పీజీ కాండోనేషన్ ఫీజు రూ.1000కి చేరిక!

ఓయూ విద్యార్థులకు భారీ షాక్.. భారీగా అకడమిక్ సేవల ఛార్జీల పెంపు
X

దిశ, వెబ్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీ (OU) పరిధిలో చదివే విద్యార్థులకు అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. తాజాగా వారు తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. 2026-27 విద్యా సంవత్సరం (Academic Year) నుండి విశ్వవిద్యాలయం అందించే వివిధ రకాల అకడమిక్ సేవల ఛార్జీలను భారీగా పెంచుతూ ఓయూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. సేవల రకాన్ని బట్టి ఈ ఫీజుల పెంపు కనీసం 20 శాతం నుండి గరిష్టంగా 100 శాతం వరకు ఉండటం గమనార్హం. పెరిగిన నూతన ధరలు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రకటించారు.

విద్యార్థి సంఘాల అసంతృప్తి

యూనివర్సిటీ తాజా నిర్ణయం ప్రకారం.. విద్యార్థులు నిత్యం ఉపయోగించుకునే ఈక్వివలెన్సీ (Equivalency), ఎలిజిబిలిటీ సర్టిఫికెట్లు (Eligibility Certificates), మైగ్రేషన్, కాండోనేషన్ (Condonation) తదితర సేవలన్నింటికీ ఇకపై విద్యార్థులు అధిక మొత్తంలో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. ముఖ్యంగా హాజరు శాతం తగ్గినప్పుడు విద్యార్థులు చెల్లించే యూజీ (UG), పీజీ (PG) కాండోనేషన్ ఫీజును గతంలో ఉన్న రూ. 500 నుంచి ఏకంగా రూ. 1,000 కి (100% పెంపు) పెంచడంపై విద్యార్థులు, విద్యార్థి సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. యూనివర్సిటీపై పడుతున్న అదనపు నిర్వహణ వ్యయం కారణం చేతనే ఈ ధరల సవరణ అనివార్యమైందని అధికారులు సమర్థిస్తుండగా, సాధారణ, మధ్యతరగతి విద్యార్థులపై భారం పడేలా ఉన్న ఈ ఫీజుల పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఓయూ క్యాంపస్‌లో డిమాండ్‌లు వినబడుతున్నాయి.

Next Story