KTRకు బిగుస్తున్న ఉచ్చు.. పురపాలక శాఖ అవినీతిని వెలికి తీసేలా సర్కారు ప్లాన్

by Disha Web Desk 4 |
KTRకు బిగుస్తున్న ఉచ్చు.. పురపాలక శాఖ అవినీతిని వెలికి తీసేలా సర్కారు ప్లాన్
X

దిశ, తెలంగాణ బ్యూరో: గత పాలనలో పేరుకుపోయిన అవినీతిని ప్రక్షాళన చేయడంపై దృష్టి పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. పురపాలక శాఖలో అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసుకుని వారిపై ఏసీబీ సోదాలను మొదలుపెట్టింది. అందులో ఫస్ట్ స్టెప్‌గా హెచ్ఎండీఏ డిపార్టుమెంటును ఎంచుకున్నది. ప్లానింగ్ సెక్షన్‌లో పనిచేసే శివబాలకృష్ణ అనే అధికారి నివాసంపై చేసిన సోదాల్లో రూ.వంద కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు తేలింది. ఈ సోదాలు ఇంకా కొనసాగనున్నాయి. ఈ సోదాల్లో లభించిన విలువైన డాక్యుమెంట్లు, అధికారులతో పాటు లీడర్లతో జరిగిన పలు రూపాల్లోని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశమున్నది. వీటి ఆధారంగా మరికొద్దిమంది ఈ అవినీతి ఉచ్చులో చిక్కుకోనున్నారు.

త్వరలో మరికొందరి పేర్లు బయటకు

నగర శివారు ప్రాంతాల్లో పది వేల ఎకరాల భూమిని గులాబీ పార్టీ లీడర్లు కబ్జాచేశారని, బినామీల పేర్లతో కొనుగోలు చేశారని ఎన్నికల సమయంలోనే రేవంత్‌రెడ్డి బహిరంగంగా విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అంతు చూస్తామని, ఎవరికి ఎంతెంత భూమి ఉన్నదో తేలుస్తామన్నారు. దానికి తగినట్లుగానే ఒక వ్యూహం ప్రకారం కిందిస్థాయి నుంచి అవినీతి వ్యవహారాన్ని బైటకు లాగుతున్నది. బాలకృష్ణతో లింకులు ఉన్న అధికారుల పేర్లు త్వరలో వెల్లడికానున్నాయి. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గత పాలనలో పనిచేసిన ఐఏఎస్ అరవింద్ కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం అప్పటి మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశాల మేరకు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన ఆరోపణల్లో చిక్కుకున్నారు.

ఇప్పుడు అవినీతి విషయంలోనూ ఆయన పాత్ర బాలకృష్ణ ద్వారా వెలుగులోకి రావచ్చన్న టాక్ పురపాలక శాఖ వర్గాల్లో జోరుగా సాగుతున్నది. చివరకు ఈ లింకు అప్పటి మంత్రి కేటీఆర్ దాకా వెళ్తుందని, భూముల రిజిస్ట్రేషన్లలో నిబంధలకు విరుద్దంగా జరిగిన లావాదేవీలన్నీ ఒక్కటొక్కటిగా బైటకు వస్తాయని, దీని వెనక ఉన్న సూత్రధారులు, పాత్రధారుల వివరాలన్నీ బహిర్గతమవుతాయన్నది ఆ శాఖలోని సిబ్బంది అభిప్రాయం. ఫార్ములా ఈ-రేస్ విషయంలో చిక్కుకున్న అరవింద్ కుమార్ ఇప్పుడు అవినీతి వివాదంలోనూ ఇరుక్కోక తప్పదనే జనరల్ టాక్ మొదలైంది.

గులాబీ నేతలతో అంటకాగిన అధికారులు

ప్లానింగ్ వింగ్‌లో పనిచేస్తున్న బాలకృష్ణ రూ.వందల కోట్లు అవినీతి రూపంలో పోగేసుకుంటే వివిధ స్థాయిల్లోని అధికారులు, అప్పటి అధికార పార్టీ నేతలు ఏ స్థాయిలో నల్లధనాన్ని పోగేసుకున్నారనేది చర్చనీయాంశంగా మారింది. పలు రియల్‌ఎస్టేట్ కంపెనీలతో అధికార పార్టీ నేతలతో పాటు హెచ్ఎండీఏ, ఎంఏయూడీ విభాగాల్లోని అధికారులు అంటకాగారని, అవినీతికి ఆశపడి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు ఇచ్చారన్న అపవాదు చాలాకాలంగా ఉన్నది. ఫీనిక్స్ సంస్థపై గతంలో ఈడీ సోదాలు జరిగినప్పుడే ఈ ఆరోపణలు వినిపించాయి.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఏసీబీ రంగంలోకి దిగడంతో ఏ రియల్ ఎస్టేట్ సంస్థలో ప్రత్యక్షంగా, పరోక్షంగా బాలకృష్ణ లాంటి ఆఫీసర్లకు ఏ తరహా లింకులు ఉన్నాయనేది త్వరలో వెల్లడి కానున్నది. విలువైన భూముల్ని పొలిటికల్ బలంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు మొదలు అప్పటి అధికార పార్టీ నేతలు ఆక్రమించుకున్నారని అప్పట్లోనే బలంగా వినిపించినా బహిరంగంగా మాట్లాడే సాహసం చేయలేకపోయారు చాలా మంది. ఈ లింకులన్నీ చివరకు కేటీఆర్ దగ్గరికే చేరుతాయని, పదేండ్ల కాలంలో ఆయన నిర్వాకం ఏ స్థాయిలో ఉన్నదో యావత్తు ప్రజానీకానికి వివరించడానికి బాలకృష్ణ నివాసాలపై ఏసీబీ సోదాలు, పట్టుబడిన డాక్యుమెంట్లు, ఉన్నతాధికారుల అండదండలు, అప్పటి అధికార పార్టీ నేతల సపోర్టు.. ఇవన్నీ ఒక్కొక్కటిగా బైటపడతాయన్నది ఎంఏయూడీలో వినిపిస్తున్న మాటలు.

Next Story