- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మిక పక్షపాతిగా ప్రజా ప్రభుత్వం: మంత్రి పొన్నం ప్రభాకర్
కార్మికుల సమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

దిశ, హుస్నాబాద్: కార్మికుల సమస్యల పరిష్కారంలో తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. బుధవారం హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపోలో నిర్వహించిన అంతర్జాతీయ కార్మిక దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఇటీవల మృతి చెందిన డ్రైవర్ శంకర్ గౌడ్కు సభ నివాళులర్పించింది. అనంతరం మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన 48 గంటల్లోనే 'మహాలక్ష్మి' పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించి, నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు, కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. త్వరలోనే కార్మిక సంఘాల ఎన్నికలు నిర్వహించి, పెండింగ్లో ఉన్న సీసీఎస్, పీఎఫ్ బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చారు. సమ్మె నోటీసు ఇచ్చిన తరుణంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రుల కమిటీతో కలిసి 15 గంటల పాటు చర్చలు జరిపి, 32 డిమాండ్లలో 29 అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలతో సంస్థను బలోపేతం చేస్తున్నామని, కార్మికులు తమ వ్యక్తిగత సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దండి లక్ష్మీ, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్టీసీ ఈడీ సోలమన్, కౌన్సిలర్ లు, ఆర్టీఏ మెంబర్ సూర్య వర్మ , మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, ఏసిపి సదానందం, ఆర్టీసీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.






