తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి కొత్త సెంటిమెంట్

by Disha Web Desk 2 |
తెలంగాణ రాజకీయాల్లో తెరపైకి కొత్త సెంటిమెంట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఓ వైపు అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వ్యవహారం సాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే అనేక అంశాలపై ఈ ఇరుపార్టీల మధ్య 'నువ్వా నేనా' అన్నట్లు పొలిటికల్ ఫైట్ నుడుస్తుండగా తాజాగా ఈ జాబితాలోకి మరొ కొత్త అంశం రోజు రోజుకు బలపడుతోంది. తెలంగాణలో శివాజీ సెంటిమెంట్ ఇప్పుడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

ఇప్పటికే 'జై శ్రీరామ్' నినాదంతో బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తుంటే 'జై హనుమాన్' నినాదంతో బీజేపీకి చెక్ పెట్టాలని బీఆర్ఎస్ స్పీడ్ పెంచుతోంది. అయితే ఈ రెండు నినాదాలతో పాటు ఇప్పుడు 'జై శివాజీ మహారాజ్' నినాదం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా ఆదివారం శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్వరం నియోజకవర్గంలో శివాజీ జయంతి వేడుకలు ఘర్షణకు దారి తీసింది. బీజేపీ చేపట్టిన ర్యాలీని బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారని బీజేపీ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో ఇరుపార్టీల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే తెలంగాణతో సహా దేశవ్యాప్తంగా ఇతర చోట్లలోనూ ఛత్రపతి శివాజీ కేంద్రంగా వివాదం రాజుకుంది. ఢిల్లీ జేఎన్ యూలో లెఫ్ట్, ఏబీవీపీ విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. శివాజీ చిత్రపటం ధ్వంసం చేయడంతో ఈ రచ్చ రాజుకుంది. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ వద్ద ఏబీవీబీ నేతలు ఏర్పాటు చేసిన శివాజీ చిత్రపటం సాయంత్రానికి ధ్వంసం అయిన స్థితిలో కింద పడి ఉంది. దీనికి లెఫ్ట్‌కు సంబంధించిన విద్యార్థి నేతలే కారణం అని ఏబీవీపీ నేతలు అనుమానించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కాగా ఇటు తెలంగాణ, అటు జాతీయ స్థాయిలో త్వరలో ఎన్నికలు జరగనున్నాయి.

ఈ క్రమంలో నానాటికి బలపడుతున్న శివాజీ నినాదం రాజకీయ వర్గాల్లో చర్చగా మారుతోంది. తెలంగాణలో ఇప్పటికే శివాజీ అంశం బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారిపోయింది. బోధన్ లో శివాజీ విగ్రహం ఏర్పాటుపై బీజేపీ, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఈ వివాదంపై గతంలో సీఎం కేసీఆర్ సైతం స్వయంగా స్పందించారు. శివాజీ పేరుతో రాజకీయాలు చేయవద్దని సీరియస్ అయ్యారు. శివాజీని అందరికంటే తామె ఎక్కువగా గౌరవిస్తున్నామని, పర్మిషన్ తీసుకుని ఆరు అడుగులు కాకుంటే 60 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్మిషన్ తీసుకోకుండా గూండాగిరి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి మహేశ్వరం నియోజకవర్గంలో చెలరేగిన వివాదం రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో శివాజీ నినాదం కీలకం కాబోతోందా అనే చర్చ తెరపైకి వస్తోంది.

Also Read..

Nandamuri Taraka Ratna Last Rites LIVE :ఫిల్మ్‌ ఛాంబర్‌లో తారకరత్న పార్థివదేహం



Next Story

Most Viewed