ఎర్రజొన్న విత్తన వ్యాపారుల మాఫియా సిండికేట్

by Disha Web Desk 4 |
ఎర్రజొన్న విత్తన వ్యాపారుల మాఫియా సిండికేట్
X

దిశ, ఆర్మూర్: ఇందూరు జిల్లాలో ఆశించిన మేరకంటే ఎక్కువ స్థాయిలో వర్షాలు సమృద్ధిగా కురిసినా గతంతో పోలిస్తే ఈ ఏడాది ఎర్రజొన్న పంట సాగు గణనీయంగా తగ్గింది. గతంలో సుమారు 50 వేల ఎకరాల్లో రైతులు ఎర్రజొన్న పంటను సాగు చేస్తున్నట్లు లెక్కలు ఉన్న ఈ సీజన్లో మాత్రం సుమారు 30 వేల ఎకరాల్లో మాత్రమే ఎర్ర జొన్న పంటను రైతులు సాగు చేస్తున్నారు.

ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, కరీంనగర్ జిల్లాల్లో పంట కోత దశకు చేరుకోవడంతో రైతులను మోసం చేసేందుకు మరోసారి ఎర్రజొన్న విత్తన వ్యాపారుల మాఫియా సిండికేట్‌గా మారినట్లు తెలుస్తుంది. ఎర్ర జొన్న విత్తన వ్యాపారులందరూ గ్రూపులుగా ఏర్పడి ఆ గ్రూపుల లీడర్ల కనుసన్నల్లోనే రైతులను వంచించి దగా చేసేందుకు సిద్ధమవుతున్నారు.

ఈ ఏడు ఇందూరు జిల్లాతో పాటు రాష్ట్రమంతట విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాతో పాటు నిర్మల్, అదిలాబాద్ జిల్లాలో ఈ యాసంగిలో గతంతో పోలిస్తే ఎర్రజొన్న సాగు ఈ ఏడాది కొంచెం తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం భూగర్భ జలాలు పెరగడం వాతావరణం సహకరించడంతో ఎర్ర జొన్న పంట దిగుబడులు బాగానే వచ్చాయి.

ప్రస్తుతం ఎర్రజొన్న పంట కోత దశకు రావడంతో ఇందూరు జిల్లాలోని ఆర్మూర్ ప్రాంత రైతాంగంతో పాటు జిల్లా యావత్ రైతంగాన్ని మరోసారి మోసం చేసేందుకు ఎర్రజొన్న వ్యాపారులు కుయుక్తులు పన్నుతున్నారు. ఎర్రజొన్న విత్తన వ్యాపారులందరూ సిండికేట్‌గా ఏర్పడి వారం రోజుల కిందట రూ.4 వేల క్వింటాల్ ధర పరికిన ఎర్ర జొన్న‌ల పంటను ఒక్కసారిగా ధరలు తగ్గించి రూ.3200 చొప్పున గ్రామాల్లో తిరుగుతూ రైతులకు కల్లబొల్లి మాటలు చెబుతూ ఒప్పందాలు చేసుకుంటున్నారు.

కర్ణాటక రాష్ట్రంలోని బళ్లారి ప్రాంతంలో మన రాష్ట్రంలో సాగు చేసే ఎర్ర జొన్న పంట అక్కడ కూడా సాగవుతుంది. కానీ మన ఎర్రజొన్న పంటతో పోలిస్తే బళ్లారిలో సాగయే ఎర్ర జొన్న సైజు కాస్త తక్కువగా ఉంటుంది. కానీ బళ్లారి ప్రాంతంలోనే ఎర్రజొన్న క్వింటాల్ ద్వారా రూ.3500 పలుకుతుండగా, ఆర్మూర్ ప్రాంతంలోని ఆలూరు గ్రామంలో రూ.3230 క్వింటాల్ ఎర్ర జొన్నల ధర చొప్పున ఎర్ర జొన్నల విత్తన వ్యాపారులైన సిండికేట్ మాఫియా ఒప్పందాలు చేసుకుంటుంది.

కానీ వారం రోజుల క్రిందట గత ఏడాది పండించిన ఎర్ర జొన్నల పంటలను కోల్డ్ స్టోరేజిల్లో నిల్వ ఉంచిన ఎర్ర జొన్నలను క్వింటాల్‌కు రూ.4 వేల ధర వెచ్చించి ఎర్ర జొన్న విత్తన వ్యాపారులు కొనుగోలు చేశారు. దీంతోపాటు రెండు రోజుల కిందట సైతం రూ.3800 ధరకు ఎర్రజొన్న విత్తనాలను వ్యాపారులు రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారు. ఆర్మూర్ ప్రాంతంలోని ఎర్రజోన్న విత్తన వ్యాపారులందరూ సిండికేట్‌గా మారి మరో మారు ఎర్ర జొన్న రైతును మోసం చేసేందుకు ఎర్రజొన్న పంట ధరను అమాంతంగా తగ్గిస్తూ గ్రామాల్లో ఒప్పందాలు చేసుకుంటూ రైతులను దగా చేస్తున్నారు.

రూ.3200 చొప్పున గ్రామాల్లో తిరుగుతూ ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఎర్రజొన్న విత్తన వ్యాపారులందరూ రైతుల వద్ద నుంచి తక్కువ ధరలో ఎర్ర జొన్నలను కొనుగోలు చేసి ప్రాసెసింగ్, ప్యాకింగ్ చేస్తున్న ఎర్రజొన్నలను ఉత్తర భారత ప్రాంతానికి చెందిన ఢిల్లీ తదితర వ్యాపారస్తులకు అధిక ధరలకు అమ్మేందుకు కమిట్మెంట్లు తీసుకుంటూ మరో మారు ఆర్మూర్ ఎర్ర జొన్న రైతులను నట్టేట ముంచేందుకు ప్లాన్ చేశారు.

ఈ మేరకు ఆర్మూర్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. నిజామాబాద్ జిల్లాలోని ఎర్రజొన్న రైతులతో పాటు, నిర్మల్, మెట్ పల్లి ప్రాంతాలకు చెందిన రైతులందరూ ఏకమై ఎర్రజొన్న విత్తన వ్యాపారుల కుయుక్తులను పటాపంచలు చేస్తూ, ఢిల్లీలో ఎర్రజొన్నల ధరలు తెలుసుకొని ఇక్కడి ఆర్మూర్ ప్రాంత ఎర్ర జొన్న విత్తన వ్యాపారులతో ఆర్మూర్ ప్రాంతానికి చెందిన ఎర్రజొన్న రైతులు ఒప్పందాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది.

Next Story

Most Viewed