సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తయారుచేస్తా: R S Praveen Kumar

by Disha Web Desk 2 |
సమాజానికి ఉపయోగపడే విద్యార్థులను తయారుచేస్తా: R S Praveen Kumar
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యకున్న ప్రాధాన్యతను చాలా ప్రభుత్వాలు గుర్తించడంలేదని, అందువల్లనే నిర్లక్ష్యానికి గురవుతున్నాయని BSP నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. బహుజన రాజ్యంలో విద్యా రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని, సమాజానికి ఉపయోగపడే తీరులో విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఉంటుందన్నారు. నెల రోజుల అమెరికా పర్యటనలో భాగంగా అక్కడి కాలమానం ప్రకారం బుధవారం ఉదయం బ్రాండయిజ్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించి అక్కడి ఫార్మా విభాగంలో శాస్త్రవేత్తగా ఉన్న వరంగల్ జిల్లాకు చెందిన వినయ్ ఆరేపల్లితో సమావేశమయ్యారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి ఆర్థిక ఇబ్బందుల మధ్యనే విద్యాభ్యాసం చేసి చివరకు అమెరికాలో సెటిల్ అయ్యారని గుర్తుచేశారు.

ఆ తర్వాత బోస్టన్‌లోని హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో 'విద్య-విముక్తి' అనే అంశం మీద ప్రసంగించారు. తెలంగాణలోని విద్యారంగం గురించి వివరిస్తూ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో విద్యారంగంలో వినూత్న విధానాలతో వచ్చిన ఫలితాలు, అప్పుడు చదువుకున్న విద్యార్థులు వేర్వేరు రంగాల్లో ఉన్నత విద్యలో కొనసాగుతుండడ తదితర అంశాలను ఆర్ఎస్పీ వివరించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడున్న విద్యా సంస్థలనే అదనపు నిధుల అవసరం లేకుండా అద్భుతంగా తీర్చిదిద్దవచ్చని, ప్రజాధనం దుర్వినియోగాన్ని అరికట్టవచ్చన్నారు. బహుజన రాజ్యంలో హార్వర్డ్ విశ్వవిద్యాలయం స్థాయి ప్రమాణాలతో విద్యాసంస్థలను వృద్ధి చేస్తామని తెలిపారు.

అక్కడి విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు పలువురు ఆర్ఎస్‌పీ ప్రస్తుత రాజకీయ జీవితం, గతంలోని గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి, దానికి ముందు ఐపీఎస్ అధికారిగా పనిచేసిన కాలం నాటి జ్ఞాపకాలను, తేడాల గురించి ప్రశ్నించారు. ఏ రంగంలో ఉన్నా నిజాయితీతో, పట్టుదలతో, చిత్తశుద్ధితో పనిచేస్తే ఫలితాలు వస్తాయన్నారు. గురుకుల సొసైటీ సెక్రటరీగా పనిచేస్తున్న కాలంలో సిలబస్ సహా ఎక్స్ ట్రా కరికులర్ యాక్టివిటీస్‌లో భాగంగా వారికి నేర్పిన అంశాలు, సమాజ అధ్యయనానికి అవసరమైన మెలకువలు, నైతిక విలువలు తదితరాలన్నింటిపై చైతన్యం కలిగించామని, అలా చదువుకున్న విద్యార్థులే ఇప్పుడు విశ్వవిద్యాలయాల్లో ఉన్నత చదువులు చదువుతున్నారని అన్నారు.

అమెరికా టూర్‌లో భాగంగా అక్కడి కెన్నడీ స్కూల్‌లో చదువుకున్నప్పటి జ్ఞాపకాలను ఆర్ఎస్‌పీ నెమరువేసుకున్నారు. ఆ కళాశాలను సందర్శించారు. హార్వర్డ్ వర్శిటీ సందర్శనలో భాగంగా అక్కడి డార్ట్ మౌత్ కాలేజీని కూడా విజిట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతి తాజా పరిస్థితుల గురించి హార్వర్డ్ వర్శిటీ విద్యార్థులు, స్కాలర్లు అడిగి తెలుసుకున్నారు. అన్ని సెక్షన్ల ప్రజలకు ఉండాల్సినంతటి గుర్తింపు, గౌరవం గురించి వివరించిన ఆర్ఎస్‌పీ బహుజన రాజ్యంలో మాత్రమే అట్టడుగు వర్గాలు, అణచివేతకు గురయ్యే సెక్షన్ల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు.

అమెరికాలో వరంగల్ యువకుడ్ని అభినందించిన R. S. Praveen Kumar


Next Story

Most Viewed