దశాబ్ధి ఉత్సవాలకు కమిటీ ఏర్పాటు

by Dishafeatures2 |
దశాబ్ధి ఉత్సవాలకు కమిటీ ఏర్పాటు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను 21 రోజుల పాటు అన్ని జిల్లాల్లో గ్రాండ్‌గా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ప్రధాన కార్యదర్శి శాంతికుమారి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిటీకి రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ అశోక్‌రెడ్డి కన్వీనర్‌గా ఉంటారు. మొత్తం పన్నెండు మంది సభ్యులుండే ఈ కమిటీలో వివిధ శాఖల అధికారులు, సలహాదారు కేవీ రమణాచారి (రిటైర్డ్ ఐఏఎస్), ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ తదితరులు కూడా ఉన్నారు. రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్ళు పూర్తి చేసుకుని పదో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సమయంలో ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రమోట్ చేసుకునే విధంగా ఈ ఉత్సవాలు జరగనున్నాయి. మొత్తం మూడు వారాల పాటు జరిగే కార్యక్రమాలన్నింటిపై స్పష్టమైన షెడ్యూలును ఈ కమిటీ రూపొందించనున్నది.

సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలను సైతం నిర్వహించాల్సిందిగా ముఖ్యమంత్రి సూచించడంతో వీటి రూపకల్పనపై ఈ కమిటీ దృష్టి సారించనున్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పేరుతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాలు ఎక్కడెక్కడ ఏ తీరులో ఉండాలో ఈ కమిటీ లోతుగా చర్చించి నిర్దిష్ట కార్యాచరణను ఖరారు చేయనున్నది. మొత్తం 21 రోజుల పాటు జరగనున్నందున ఏ డిపార్టుమెంట్ తరపున ఎలాంటి యాక్టివిటీ ఉండాలి, ఇందుకు ఏయే శాఖల సహకారాన్ని తీసుకోవాలి, వివిధ సెక్షన్ల ప్రజలను ఏ రూపంలో భాగస్వామ్యం చేయాలి, విస్తృతంగా జనంలోకి వెళ్ళేలా కమిటీ సభ్యులు కసరత్తు చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేనంత ఆర్భాటంగా నిర్వహించాలని భావిస్తుండడంతో కమిటీ రూపొందించే ప్రణాళికపై ముఖ్యమంత్రి పరిశీలించి తగిన సూచనలు, మార్పులు చేర్పులు చేసే అవకాశముంది.



Next Story