హౌసింగ్​ బోర్డు స్థలం కబ్జా చేసిన వారిపై కేపీహెచ్​భీ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు!

by Disha Web Desk 10 |
హౌసింగ్​ బోర్డు స్థలం కబ్జా చేసిన వారిపై కేపీహెచ్​భీ పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు!
X

దిశ, కూకట్​పల్లి: సాయినగర్​లో అక్రమ నిర్మాణదారులు తగ్గేదే లే అన్న విధంగా యధేచ్ఛగా నిర్మాణ పనులు చేపడుతూ అధికారులకు సవాల్​ విసురుతున్నారు. ఓ వైపు జీహెచ్​ఎంసీ నోటీసులు అందజేసిన, మరోవైపై హౌసింగ్​ బోర్డు అధికారులు పోలీస్​ స్టేషన్​లో కేసు నమోదు చేసనా కబ్జా చేస్తున్న వారికి చీమ కుట్టినట్టు కూడా లేదు. నియోజకవర్గం పరిధి కేపీహెచ్​బీ డివిజన్​ సాయి నగర్​ కాలనీలో హౌసింగ్​ బోర్డుకు చెందిన ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు పీకేసి కోట్లు విలువ చేసే స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్న విషయంలో గత కొంత కాలంగా హౌసింగ్​ బోర్డు అధికారులు, జీహెచ్​ఎంసీ అధికారులతో కలిసి అక్రమ నిర్మాణాన్ని అడ్డుకునేందుకు చేపడుతున్న చర్యలు కొలిక్కి రావడం లేదు. జీహెచ్​ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాన్ని నిలిపి వేయాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చి నిర్మాణ పనులను నిలిపి సేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించడం లేదు. ప్లాట్​ నంబర్​ 92లో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కుక్కను వదిలి అక్కడి వచ్చే జీహెచ్​ఎంసీ టౌన్​ప్లానింగ్​ సిబ్బందిపై ఉసి గొలుపుతున్నట్టు టౌన్​ప్లానింగ్​ అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా సాయి నగర్​లోని సర్వే నంబర్​ 1056, 1057లలోని కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాన్ని కొంత మంది పక్క గ్రామం అయిన హైదర్​ నగర్​కు చెందిన సర్వే నంబర్​ 145 పేరుతో కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని హౌసింగ్​ బోర్డు ఈఈ కేపీహెచ్​బీ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు.

ఐఏఎస్​ లేఖకు మరో ఐఏఎస్​ స్పందన శూన్యం

హౌసింగ్​ బోర్డు స్థలాన్ని కాపాడాలంటూ హౌసింగ్​ బోర్డు వైస్​ చైర్మన్​ ఐఏఎస్​ అధికారిని గత కొన్ని రోజుల క్రితం జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఐఏఎస్​ అధికారికి లేఖ రాశారు. కాగా జీహెచ్​ఎంసీ కమిషనర్​ ఆదేశాలు అమలు చేసే వారు మూసాపేట్​ సర్కిల్​లో కనిపించ డం లేదు. నిర్మాణ పనులు అడ్డుకోవడంలో గత 4 రోజులుగా జీహెచ్​ఎంసీ టౌన్​ ప్లానింగ్​ అధికారులు విఫలమవుతున్నారు. ఒక రోజు సిబ్బంది కొరత, మరో సారి ఇంకో సాకు. ఇటు జీహెచ్​ఎంసీ అటు హౌసింగ్​ బోర్డు అధికారులతో ప్లాట్​ నంబర్​ 63, 92లలో నిర్మాణ చేపడుతున్న అక్రమ నిర్మాణ దారులు బంతాట ఆడుకుంటూ తమ నిర్మాణ పనులను చేపడుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.

రెండూ ప్రభుత్వ భూములే

సాయి నగర్​ కాలనీ వాసులు కూకట్​పల్లి మండలం సర్వే నంబర్​ 1056, 1057 సర్వే నంబర్​లలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ హౌసింగ్​ బోర్డు అధికారులు ఆరోపిస్తుంటే.. కావు సాయినగర్​ కాలనీ హైదర్​నగర్​ గ్రామం సర్వే నంబర్​ 145కు చెందిన భూమిలో ఉందని, 1992లోని తాము ఇంటి స్థలాలు కొనుగోలు చేశామని, రిజిస్ట్రేషన్ అయిందని కాలనీ వాసులు వాదిస్తున్నారు. ఇదిలా ఉండగా హైదర్​నగర్​ గ్రామం సర్వే నంబర్​ 145 ప్రభుత్వ భూమిగా, ప్రొహిబిటేడ్​ లిస్ట్​లో ధరణి పోర్టల్​లో దర్శనమిస్తుంది. అంతే కాకుండా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన జీవో నంబర్​ 59లో సాయి నగర్​ కాలనీ నుంచి పదుల సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. కొంత మంది ఆన్​లైన్​ ద్వారా వచ్చిన డిమాండ్​ నోటీస్​ ప్రకారం ఆన్​లైన్​లో రెవెన్యు శాఖకు డబ్బులు చెల్లించారు. సాయి నగర్​ కాలనీ ప్రభుత్వ భూమి కాబట్టే జీవో నంబర్​ 59 ప్రకారం క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకున్నారని స్థానికులు తెలిపారు.

అక్రమ నిర్మాణదారుడిపై కేసు నమోదు

సాయి నగర్​ కాలనీలోని ప్లాట్​ నంబర్​ 92కు చెం దిన ఎల్​. నాగేశ్వర్​ రావు, మరి కొంత మంది తో కలిసి హౌసింగ్​ బోర్డుకు చెందిన స్థలంలో హెచ్చరిక బోర్డులను తొలగించిన 208 చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేస్తున్నట్టు హౌసింగ్​ బోర్డు ఈఈ కేపీహెచ్​బీ పోలీస్​ పోలీస్​ స్టేషన్​లో ఈ నెల 12న ఫిర్యాదు చేశారు. దీంతో ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఎల్​. నాగేశ్వర్​ రావు, ఎం. కిరణ్​ బాబులపై క్రైం నంబర్​ 369/2023, ఐపిసి 447, 427, ఆర్​/డబ్ల్యూ 34 కింద కేసు నమోదు చేశారు. . ఇదిలా ఉండగా ఎల్​. నాగేశ్వర్ రావు కోర్టులో జీహెచ్​ఎంసీ అధికారులు నిర్మాణ పనులను అడ్డుకోకుండా జీహెచ్​ఎంసీకి వ్యతిరేకంగా మార్చి2, 2023న ఓఎస్​ నంబర్​ 74 ఆఫ్​ 2023 కోర్టును ఆశ్రయించగా జీహెచ్​ఎంసీ నిర్మాణ పనులను అడ్డుకోవద్దు, నాగేశ్వర్​ రావు ఎటువంటి పనులు చేపట్టవద్దంటూ కోర్టు స్టేటస్​ కో ఆర్డర్​ ఇచ్చింది. ఇదిలా ఉండగా కోర్టు ఇచ్చిన స్టేటస్​ కో ను ధిక్కరిస్తు యధేచ్ఛగా నిర్మాణ పనులు నిర్విరామంగా కొనసాగుతున్నాయి.



Next Story

Most Viewed