షోరూమ్ ముందే ఆగిపోయిన రూ.25 లక్షల ఎలక్ట్రిక్ కారు.. చేతులెత్తేసిన యాజమాన్యం! కస్టమర్ ఆందోళన

by Ramesh Naini |

లక్షల రూపాయలు వెచ్చించి ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న కొత్త కారు.. కనీసం షోరూమ్ దాటకముందే ఆగిపోతే ఆ వినియోగదారుడి పరిస్థితి ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి చేదు అనుభవమే హైదరాబాద్‌లోని ఓ కస్టమర్‌కు ఎదురైంది.

షోరూమ్ ముందే ఆగిపోయిన రూ.25 లక్షల ఎలక్ట్రిక్ కారు.. చేతులెత్తేసిన యాజమాన్యం! కస్టమర్ ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ రాయదుర్గంలోని విన్‌ఫాస్ట్ కార్ల షోరూమ్ వద్ద కొనుగోలు చేసిన కొత్త ఎలక్ట్రిక్ కారు షోరూమ్ బయటే ఆగిపోవడంతో వివాదం నెలకొంది. బాధితుడి కథనం ప్రకారం, జూన్‌ 2న సుమారు రూ.25 లక్షల విలువైన వీఎఫ్‌7 విండ్‌ కారును కొనుగోలు చేయగా, మరుసటి రోజు చార్జింగ్ కోసం షోరూమ్‌కు తీసుకువెళ్లిన సమయంలో కిలోమీటర్‌ కూడా ప్రయాణించకముందే వాహనం నిలిచిపోయింది. వాహనంలో తలెత్తిన సమస్యను షోరూమ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా తగిన స్పందన లభించలేదని అతను ఆరోపించారు. కారు మార్పిడి చేయడం గానీ, డబ్బులు తిరిగి చెల్లించడం గానీ చేయడం లేదని, సమస్య పరిష్కారంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. తనను షోరూమ్ నుంచి బయటకు పంపించారని కూడా ఆయన వాపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా విన్‌ఫాస్ట్ కార్ల షోరూమ్ వద్ద కస్టమర్ ఆందోళనకు దిగారు.

ఈ ఘటనపై ఇప్పటికే వినియోగదారుల ఫోరంను ఆశ్రయించినట్లు బాధితుడు తెలిపారు. కాగా, ఘటనకు సంబంధించిన ఆరోపణలపై విన్‌ఫాస్ట్ సంస్థ లేదా షోరూం యాజమాన్యం నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. కొత్త కారు కొన్న వెంటనే కస్టమర్‌కు ఇలాంటి చేదు అనుభవం ఎదురవడం, ఫిర్యాదు చేస్తే యాజమాన్యం నిర్లక్ష్యంగా ప్రవర్తించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, వాహనం ఆగిపోవడానికి గల సాంకేతిక కారణాలు, కస్టమర్ ఆరోపణలపై షోరూమ్ యాజమాన్యం నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Next Story