సర్పంచ్ పదవి కోసం కన్న బిడ్డను హత్య చేసిన కసాయి తండ్రి

by Prasad Jukanti |   (  Updated:2026-02-02 12:19:55  IST  )

పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా పోటీ చేయాలనే వ్యామోహంతో కన్నకూతుర్ని హత్య చేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది.

సర్పంచ్ పదవి కోసం కన్న బిడ్డను హత్య చేసిన కసాయి తండ్రి
X

దిశ, డైనమిక్ బ్యూరో: సర్పంచ్ పదవి వ్యామోహం ముందు కన్న ప్రేమ చిన్నబోయింది. ఎన్నికల్లో పోటీకి అడ్డుగా మారిందని కన్నకూతుర్ని పొట్టన పెట్టుకున్నాడు ఓ కసాయి తండ్రి. నిజామాబాద్ జిల్లాలో వెలుగు చూసిన ఈ దారుణ ఘటన ఇప్పుడు అందరిని కలిచివేస్తోంది. మహారాష్ట్రలోని ముఖెడ్ మండలం కేరూర్ గ్రామానికి చెందిన పాండురంగ అనే వ్యక్తి అక్కడ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‍గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే తనకు ముగ్గురు సంతానం కావడంతో ముగ్గురు పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అర్హత ఉండదని భావించి ఆందోళన చెందాడు. దీంతో ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముగ్గురు పిల్లల్లో ఒకరి అడ్డుతొలగించుకోవాలని ప్రస్తుత సర్పంచ్ గణేశ్ షిండే సలహా ఇచ్చాడు.

హత్యచేసి తప్పించుకునే ప్లాన్:

అతడి సలహాతో వెనుకా ముందు ఆలోచించని పాండరంగా తన పెద్ద కూతురు ప్రాచీని దారుణంగా హత్య చేశారు. ఆ తర్వాత ఆ శవాన్ని నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం డి46 కెనాల్‍లో పడేశాడు. ఇటీవల బాలిక మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు అతడి తండ్రే హంతకుడని గుర్తించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులపై ఆరా తీయగా ఘోరం వెలుగు చూసింది. దీంతో గ్రామ సర్పంచ్ గణేశ్ షిండేతో పాటు హత్యకు గురైన బాలిక తండ్రి పాండు రంగను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‍కు తరలించారు.

అత్తింటి వేధింపులు! ముగ్గురు పిల్లలకు ఉరేసి తల్లి ఆత్మహత్యాయత్నం

Next Story