పాపులారిటా? క్యాస్ట్ ఈక్వేషనా?.. కాంగ్రెస్ హైకమాండ్‌ ఎదుట బిగ్‌టాస్క్

by Disha Web Desk 13 |
పాపులారిటా? క్యాస్ట్ ఈక్వేషనా?.. కాంగ్రెస్ హైకమాండ్‌ ఎదుట బిగ్‌టాస్క్
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో మెజారిటీ ఎంపీ స్థానాల్లో గెలుపే టార్గెట్‌గా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులపై ఇంకా సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. ఇప్పటివరకు 13 స్థానాలకు క్యాండిడేట్లను ప్రకటించగా హైదరాబాద్ సహా మరో నాలుగు స్థానాలను పెండింగ్‌లో ఉంచింది. ఇందులో ఖమ్మం, వరంగల్, కరీంనగర్ అభ్యర్థుల విషయంలో పీటముడి వీడటం లేదు. దీంతో ఈ స్థానాల్లో టికెట్ కోసం తీవ్రమైన పోటీ నెలకొన్నది. ఆశావహుల నుంచి ఒత్తిడి నేపథ్యంలో అధిష్టానం నిర్ణయం సస్పెన్స్‌గా మారింది. ఈనెల 31న మరోసారి సమావేశం కాబోతున్న కాంగ్రెస్ సీఈసీ పెండింగ్ స్థానాలపై నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

పాపులారిటీ, క్యాస్ట్ ఈక్వేషన్స్..

ఖమ్మం, వరంగల్, కరీంనగర్ స్థానాల్లో పాపులారిటీతో పాటు క్యాస్ట్ ఈక్వేషన్స్ అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేయనున్నాయనే చర్చ జరుగుతోంది. పెండింగ్‌లో ఉన్న వాటిలో ఖమ్మం హాట్ సీటుగా మారింది. ఈ స్థానానికి బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు, బీజేపీ నుంచి తాండ్ర వినోద్ రావు పేర్లు ఖరారు అయ్యాయి. అయితే ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు డెసిషన్ మేకర్‌గా ఉండటంతో కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపబోతున్నది అనేది ఉత్కంఠగా మారింది. రేసులో కాంగ్రెస్ కీలక నేతల కుటుంబ సభ్యులు ఉండటంతో అవకాశం ఎవరికి దక్కబోతున్నది అనేది ఆసక్తిని రేపుతున్నది. వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం కావడంతో ఇక్కడ బీఆర్ఎస్ తరఫున కడియం కావ్య, బీజేపీ తరపున ఆరూరి రమేశ్‌లను ఖరారు చేశారు. వీరికి దీటుగా కాంగ్రెస్ ఎవరికి పిక్ చేయబోతున్నది అనేది ఆసక్తిగా మారింది. అలాగే కరీంనగర్‌లో వెలమ, బీసీ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ వెలమ సామాజిక వర్గానికి చెందిన వినోద్‌కుమార్‌ను బరిలోకి దింపగా బీజేపీ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కుమార్‌ను రంగంలోకి దింపింది. కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నప్పటికీ ఏ సామాజిక వర్గానికి అవకాశం దక్కబోతున్నది అనేది చర్చగా మారింది.

హైకమాండ్ ఎదుట బిగ్ టాస్క్?

హైదరాబాద్ టికెట్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానానికి పెద్దగా తలనొప్పి లేకపోయినా మిగతా మూడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయడం బిగ్ టాస్క్‌గా మారిందనే చర్చ జరుగుతోంది. ఈ స్థానాల్లో కీలకమైన నేతలు రేసులో ఉండటంతో ఎవరికి టికెట్ ఇస్తే ఎవరు దూరం అవుతారనే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ ముూడు స్థానాల్లో టికెట్ల కేటాయింపు విషయంలో రాష్ట్ర నాయకత్వంతోపాటు పార్టీ జాతీయ నాయకత్వం తీవ్రంగా కసరత్తు టేస్తున్నట్లు తెలుస్తోంది.


Next Story

Most Viewed