రికార్డు స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు.. రాష్ట్ర విభజన తర్వాత ఇదే హయ్యస్ట్

by Disha Web Desk 2 |
రికార్డు స్థాయిలో తెలంగాణకు పెట్టుబడులు.. రాష్ట్ర విభజన తర్వాత ఇదే హయ్యస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగిన వార్షిక సమ్మిట్‌లో తెలంగాణకు రూ.40,232 కోట్ల మేర పెట్టుబడులు రానున్నాయి. ఈ మేరకు అవగాహనా ఒప్పందాలు కుదిరాయి. పలు దేశ, విదేశీ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకొని సంతకాలు కూడా చేసింది. గతేడాది సమ్మిట్‌లో రూ.19,900 కోట్లు మాత్రమే వస్తే ఈసారి మాత్రం రెండింతల కంటే ఎక్కువే వచ్చాయి. గడిచిన మూడేండ్లలో వచ్చిన మొత్తం పెట్టుబడులను కలిపి పోల్చినా ఈ యేడు రానున్న ఇన్వెస్టుమెంట్లే అధికం. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం అధికారులు, మంత్రుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లు అయ్యింది.

3 రోజులు 200కు పైగా కంపెనీలు

మూడు రోజుల దావోస్ పర్యటనలో సుమారు 200కు పైగా కంపెనీల ప్రతినిధులతో సీఎం రేవంత్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చర్చలు జరిపారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ప్రముఖ సంస్థలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడంతో పాటు ఒప్పందాల (ఎంఓయూ)ను కుదుర్చుకున్నాయి. మరికొన్ని సంస్థలతో జరిగిన సంప్రదింపులు విజయవంతం కావడంతో భవిష్యత్తులో కొత్త యూనిట్లు పెట్టేందుకు ముందుకు రావొచ్చన్న ఆశాభావం ఆ బృందంలో వ్యక్తమవుతున్నది. ఐటీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్, మొబిలిటీ, హెల్త్‌కేర్, ఫార్మా, లైఫ్ సైన్సెస్, వ్యవసాయం, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాలకు చెందిన కంపెనీలతో చర్చల అనంతరం పెట్టుబడులకు మార్గం సుగుమం అయ్యింది. అయితే రాష్ట్రం ఏర్పడిన తర్వాత దావోస్‌ సమ్మిట్‌లో తెలంగాణ టీమ్‌కు సీఎం నేతృత్వం వహించడం ఇదే ఫస్ట్ టైమ్.

పలు కంపెనీలతో ఒప్పందాలు

అదానీ గ్రూపు (ఎనర్జీ) రూ.12,400 కోట్లు, జిందాల్ స్టీల్స్ (జేఎస్‌డబ్ల్యూ) రూ.9,000 కోట్లు, గోడీ ఇండియా రూ.8,000 కోట్లు, వెబ్‌వెర్క్స్ రూ.5,200 కోట్లు, అరెజాన్ లైఫ్ సైన్సెస్ రూ.2,000 కోట్లు, గోద్రెజ్ రూ.1,270 కోట్లు, టాటా గ్రూప్ రూ.1,500 కోట్లు, సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ గ్రూపు రూ.231 కోట్ల చొప్పున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చి అవగాహనా ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఇవే కాకుండా బీఎల్ ఆగ్రో, ఇన్నోవెరా ఫార్మాస్యూటికల్స్, క్యూ సెంట్రియో, సిస్ట్రా, ఉబర్, ఓ-9 సొల్యూషన్స్ వంటి కంపెనీలు సైతం పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.

సీఎం స్పీచ్‌ పట్ల అభినందనలు

పెట్టుబడుల విషయంలోనే కాకుండా రాష్ట్రానికి సంబంధించిన పలు రంగాల గురించి వివరించిన సీఎం రేవంత్.. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే అంశంపై ఇచ్చిన స్పీచ్‌కు వరల్డ్ ఫుడ్ ప్రైజ్ విన్నర్ డేవిడ్ నబారో సహా సీఈటీ ప్రతినిధులు అభినందనలు తెలిపారు. చిన్న, సన్నకారు రైతుల పక్షాన నిలబడాలని ప్రపంచ దిగ్గజ కంపెనీలకు పిలుపునిచ్చి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే ప్రక్రియకు సహకరించాలని ఈ సందర్భంగా సీఎం కోరారు. హైదరాబాద్‌ను ఆసియా మెడికల్ టూరిజం రాజధానిగా మార్చేందుకు హెల్త్ కేర్‌ను సాఫ్ట్‌వేర్‌తో సమ్మిళితం చేయాలన్నారు. ఖరీదైన హెల్త్ కేర్ సేవల ఖర్చులు తగ్గించేందుకు అమెరికా, యూరప్ దేశాలు పని చేస్తున్నాయని, హెల్త్ కేర్ సర్వీసులు అందరికీ అందుబాటులో ఉంచేందుకు, అధునాతన వైద్య సేవలు మారుమూల ప్రాంతాల ప్రజలకు చేరువయ్యేలా డిజిటల్, సాంకేతికను ఉపయోగించాలని ముఖ్యమంత్రి కోరారు.

దావోస్ వేదికగా రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు

అదానీ గ్రూపు (ఎనర్జీ) - రూ. 12,400 కోట్లు

జిందాల్ స్టీల్స్ - రూ. 9,000 కోట్లు

గోడీ ఇండియా - రూ.8,000 కోట్లు

వెబ్‌వెర్క్స్ - రూ. 5,200 కోట్లు

అరెజాన్ లైఫ్ సైన్సెస్ - రూ.2,000 కోట్లు

గోద్రెజ్ - రూ.1,270 కోట్లు

టాటా గ్రూప్ - రూ.1,500 కోట్లు

సర్జికల్ ఇన్‌స్ట్రుమెంట్స్ - రూ. 231 కోట్లు

సంవత్సరాలవారీగా వచ్చిన పెట్టుబడులు

సంవత్సరం రూ.కోట్లలో

2020-500

2022-4,128

2023-19,900

2024-40,232



Next Story

Most Viewed