బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు

by Disha Web Desk 12 |
బడ్జెట్‌లో రాష్ట్రానికి రూ.38 వేల కోట్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపుల ప్రకారం తెలంగాణకు రానున్న ఆర్థిక సంవత్సరంలో సుమారు రూ.38 వేల కోట్ల మేర నిధులు సమకూరనున్నాయి. రాష్ట్రాల నుంచి కేంద్రానికి చేరే పన్నుల వాటా (డివొల్యూషన్) రూపంలో రూ.21,470 కోట్లు, 15వ ఆర్థిక సంఘం ద్వారా రూ.3,000 కోట్లు, కేంద్ర సంక్షేమ పథకాల అమలు కోసం సుమారు రూ.10 వేల కోట్ల చొప్పున అందనున్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం రెండు వెల్ఫేర్ స్కీమ్‌లను పక్కన పెడుతున్నట్లు సమాచారం వచ్చిందని తెలిపారు. వ్యవసాయ రంగంలో మార్కెట్ ఇంటర్‌వెన్షన్ స్కీమ్ (ధరల స్థిరీకరణ), రాష్ట్రీయ కృషి వికాస్ యోజన లాంటివి అమలు చేసే ఆలోచన ఉండకపోచ్చన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఫసల్ బీమా యోజన అమలు చేయనందున దాని కింద వచ్చే నిధులకు కోత పడింది.

గతేడాది బడ్జెట్‌లో రాష్ట్రానికి ఈ పద్దుల కింద రూ.36 వేల కోట్లు రాగా ఈసారి స్వల్పంగా పెరిగి అది రూ.38 వేల కోట్లకు చేరుకున్నది. దీనికి తోడు సింగరేణికి రూ.1,650 కోట్లు, మణుగూరు భారజల కర్మాగారానికి దాదాపు రూ.725 కోట్లు, గిరిజన వర్సిటీకి రూ.25 కోట్లు, బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ నుంచి కొంత సాయం అందనున్నది.

మొత్తంగా రాష్ట్రానికి రానున్న ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ.38 వేల కోట్లు వచ్చే అవకాశమున్నది. ఆయా మంత్రిత్వశాఖల పద్దులను నిశితంగా పరిశీలించిన తర్వాత స్కీమ్‌లవారీగా ఎంత వస్తుందనే క్లారిటీ వస్తుందని, కొంత సమయం పట్టొచ్చని ఆ అధికారి వివరించారు.

Also Read...

నిరుద్యోగులకు సర్కారు షాక్! ఇక ఆ స్కీం లేనట్లే?


Next Story

Most Viewed