HYD: స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు

by Gantepaka Srikanth |

హైడ్రా ప్ర‌జావాణికి సోమ‌వారం 32 ఫిర్యాదులందాయి. స్మ‌శానం వైపు చూడాలంటేనే వెనుక‌డుగు వేస్తాం.. అలాంటిది వాటిని క‌బ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు.

HYD: స్మశాన వాటికలనూ వ‌ద‌ల‌ని క‌బ్జాదారులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా ప్ర‌జావాణికి సోమ‌వారం 32 ఫిర్యాదులందాయి. స్మ‌శానం వైపు చూడాలంటేనే వెనుక‌డుగు వేస్తాం.. అలాంటిది వాటిని క‌బ్జా చేసి ఇళ్లు నిర్మించేస్తున్నార‌ని ప‌లువురు ఫిర్యాదు చేశారు. అలాగే చెరువులు, నాలాలు క‌బ్జా కాకుండా కాపాడాల‌ని ఫిర్యాదులందాయి. హైడ్రా అభివృద్ధి చేస్తున్న చెరువులను చూస్తే ముచ్చ‌టేస్తోంద‌ని.. మా ప్రాంతంలోని చెరువుల‌ను కూడా అభివృద్ధి చేయాల‌ని ప‌లువురు ప్ర‌జావాణిలో ద‌ర‌ఖాస్తులు అంద‌జేశారు. ముందుగా మురుగునీటిని బ‌య‌ట‌కు పంపి.. గుర్ర‌పుడెక్క‌ను వ‌దిలించాల‌ని కోరుతున్నారు. గొలుసుక‌ట్టు చెరువుల మాదిరి అభివృద్ధి చేసి.. వ‌ర‌ద ముప్పు లేని న‌గ‌రంగా తీర్చిదిద్దాల‌ని కాల‌నీవాసులు, సంక్షేం సంఘం ప్ర‌తినిధులు హైడ్రాకు విన‌తిప‌త్రాలు స‌మ‌ర్పించారు. ఇలా సోమ‌వారం ప్ర‌జావాణికి 32 ఫిర్యాదులందాయి. ఈ ఫిర్యాదులను హైడ్రా అదనపు సంచాలకులు వర్ల పాపయ్య పరిశీలించి, సంబంధిత అధికారుల‌కు ప‌రిష్కార బాధ్య‌త‌లు అప్ప‌గించారు. యూసుఫ్‌గూడ‌, మ‌ధురాన‌గ‌ర్ ప్రాంతాల్లో ఉన్న కృష్ణాకాంత్ పార్కులో చెరువును అభివృద్ధి చేయాల‌ని వాక‌ర్స్ అసోసియేష‌న్ హైడ్రాను కోరారు. శేరిలింగంపల్లి పరిధిలోని సెంట్రల్ పార్క్ ఫేజ్-1 కాలనీలో పార్క్ నం.4 భూమిని కొంద‌రు ఆక్రమణకు ప్రయత్నిస్తున్నారని కాలనీ వాసులు ప్రజావాణికి ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మండలంలోని టీఎన్జీఓ కాలనీ పరిధిలో ప్రభుత్వానికి చెందిన ఖాళీ స్థలం ఆక్రమణకు గురైందని స్థానికులు హైడ్రా ప్రజావాణి కి ఫిర్యాదు చేసారు. శంషాబాద్ లోని ఎంబీ.మిషన్ కంపౌండ్‌లో ఉన్న స‌మాదులు క‌బ్జాకు గురౌతున్నాయ‌ని ప్రజావాణిలో ఎంబీచర్చి, ఎంబీ సమాధుల నిర్వహణ కమిటీ ప్రతినిధి ప‌విత్ర సాగ‌ర్ ఈ ఫిర్యాదు చేశారు.

జీహెచ్ఎంసీ ప్రజావాణికి 52 ఆర్జీలు..

జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 52 విన్నపాలు, ఫిర్యాదులు ప్రజల నుంచి అందాయి. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్‌లు సత్యనారాయణ, రవి కిరణ్, చీఫ్ ఇంజినీర్ సహదేవ్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఎంఎంసీలో.. 24ఫిర్యాదులు..

ప్రజా సమస్యలను వేగవంతంగా పరిష్కరించేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. నగర ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను నేరుగా వినిపించుకునే ఈ కార్యక్రమంలో మొత్తం 24 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులను కమిషనర్ సమగ్రంగా పరిశీలించి సంబంధిత విభాగాలకు పంపిస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించేలా అధికారులకు సూచనలు జారీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతగా తీసుకుని నిర్దిష్ట గడువులో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Next Story