ఈడ‌బ్ల్యూఎఫ్ అభ్యర్థుల‌కు క‌టాఫ్ మార్కుల్లో 25 % మిన‌హాయింపు ఇవ్వాలి

by Disha Web Desk |
ఈడ‌బ్ల్యూఎఫ్ అభ్యర్థుల‌కు క‌టాఫ్ మార్కుల్లో 25 % మిన‌హాయింపు ఇవ్వాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో : పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్‌లో ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థుల‌కు క‌టాఫ్ మార్కుల్లో మిన‌హాయింపులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. సీఎం కేసీఆర్‌కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ ఆదివారం బహిరంగ లేఖ రాశారు. ప్రధాన‌మంత్రి న‌రేంద్రమోడీ ఆర్థికంగా వెన‌క‌బ‌డ్డ అగ్రకులాల పేద‌ల‌కు విద్య, ఉద్యోగాల్లో రిజ‌ర్వేష‌న్లు క‌ల్పిస్తూ ఈడ‌బ్ల్యూఎస్ రిజ‌ర్వేష‌న్లను క‌ల్పించార‌ని, ఆ విష‌యాన్ని రాష్ట్ర ప్రభుత్వం విస్మరించింద‌ని, ఇది బాధ‌క‌ర‌మైన విష‌య‌మ‌ని బండి సంజ‌య్ లేఖ‌లో పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం కార‌ణంగా ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థులకు తీవ్రమైన అన్యాయం జ‌రిగింద‌ని అన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు నోటిఫికేష‌న్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థుల‌కు క‌టాఫ్ మార్కుల్లో మిన‌హాయింపు ఇచ్చిన ప్రభుత్వం, ఈడ‌బ్ల్యూఎస్ అభ్యర్థుల‌కు మిన‌హాయింపు ఇవ్వక‌పోవ‌డం దారుణ‌మ‌ని అన్నారు. త‌క్షణ‌మే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల‌కు కూడా క‌టాఫ్ మార్కుల్లో మిన‌హాయింపును ఇవ్వాల‌ని బండి డిమాండ్ చేశారు.

అయితే, ఈ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీలకు 20%, బీసీలకు 25%, జనరల్ అభ్యర్థులకు 30% కటాఫ్ మార్కులుగా నిర్ణయించారు. దీంతో 40 మార్కులు వచ్చిన ఎస్సీ, ఎస్టీలు, 50 మార్కులు వచ్చిన బీసీలు, 60 మార్కులు వచ్చిన జనరల్ అభ్యర్థులకు మెయిన్ పరీక్ష రాయగలరు. ఈడబ్ల్యూఎస్ అభ్యర్థుల కటాఫ్ మార్కుల్లో ఎలాంటి మినహాయింపు ఇవ్వకపోవడం వల్ల వారు కూడా జనరల్ అభ్యర్థుల మాదిరిగా ప్రిలిమ్స్‌లో 60, అంతకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వారే మెయిన్ పరీక్షకు అర్హులు కాగలరు. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసిన సప్లిమెంటరీ నోటిఫికేషన్‌ను సవరిస్తూ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు మెయిన్ పరీక్ష రాసేందుకు ప్రిలిమ్స్ 25% అంటే 50 మార్కులను కటాఫ్‌గా నిర్ణయించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను ' అని లేఖ‌లో పేర్కొన్నారు. కాగా, బండి సంజ‌య్ లేఖ‌పై తెలంగాణ ప్రభుత్వం, బీఆర్ఎస్ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి.

Next Story

Most Viewed