హైదరాబాద్‌ వీధుల్లోకి దూసుకువచ్చే 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు! అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది.

హైదరాబాద్‌ వీధుల్లోకి దూసుకువచ్చే 2 వేల ఎలక్ట్రిక్‌ బస్సులు! అధికారులతో మంత్రి పొన్నం సమీక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ (Hyderabad) నగరంలో కాలుష్య రహిత రవాణా సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతోంది. పీఎం ఈ- డ్రైవ్ (PM e-drive) కింద కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ కి కేటాయిస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల (electric buses) ఆపరేషన్స్‌లో ఎదురయ్యే సవాళ్లు, మౌలిక సదుపాయాలపై స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి లతో కలిసి సెక్రటేరియట్ లో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజధాని క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా నిలబెట్టడానికి డీజిల్ బస్సుల స్థానంలో పర్యావరణ హితమైన దశలవారీగా ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా pm e- drive కింద 9 నగరాల్లో 15 వేల ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. అందులో తెలంగాణలో హైదరాబాద్ నగరానికి 2 వేల ఎలక్ట్రిక్ బస్సులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కింద ఒక్కో బస్సుకు 35 లక్షల రూపాయలు కేటాయిస్తుంది. ఈబస్సులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 6 వ తేదీ టెండర్లు పిలిచింది. ఎలక్ట్రిక్ బస్సులు ఆపరేట్ లో రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సౌకర్యాలు, ఎదురవుతున్న ఇబ్బందులు, టెక్నికల్ ఆపరేషన్స్ పై సమీక్షా సమావేశంలో చర్చించారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ప్రోత్సహించడానికి 2-వీలర్స్ 3-వీలర్స్ , 4-వీలర్స్, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు వంటి తదితర వాహనాలకు పన్ను ప్రయోజనాలను కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం EV పాలసీని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2019 మార్చిలో 40 యూనిట్లతో దేశంలోనే ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టిన మొదటి రాష్ట్రం తెలంగాణ అని ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 2023 సేకరణ ప్రణాళిక కింద 1010 అదనపు ఎలక్ట్రిక్ బస్సులను (510 ఇంటర్‌సిటీ మరియు 500 సిటీ బస్సులు) చేర్చాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు ఇప్పటికే లెటర్స్ ఆఫ్ అవార్డును జారీ చేసింది. ప్రస్తుతం, 775 ఎలక్ట్రిక్ బస్సులు (510 ఇంటర్‌సిటీ మరియు 265 సిటీ బస్సులు) నడుస్తున్నాయి. మిగిలిన 275 మార్చి 2026 నాటికి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు.

e-బస్ రంగంలోని రెండు ప్రముఖ భారతీయ OEMలతో TGSRTC గణనీయమైన ఆపరేటింగ్ అనుభవాన్ని పొందింది. అయితే గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులతో ఎదురవుతున్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లింది. కొంతమంది ఆపరేటర్లు టెండర్ షరతులను పాటించకపోవడం. ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడంలో జాప్యం లాంటివి జరుగుతున్నాయి. e-బస్ డెలివరీలలో అసాధారణ జాప్యం. బ్రేక్‌డౌన్ ఫ్రీక్వెన్సీ పరంగా e-బస్‌ల పనితీరు తక్కువగా ఉండటం. డీజిల్ (ICE) బస్సులతో పోలిస్తే సర్వీస్ రద్దు మరియు ప్రమాద రేటు ఎక్కువ నమోదు లాంటివి జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారంతో పాటు తగిన మద్దతు కై హామీ ఇస్తుంది. PM e-DRIVE పథకం కింద e-బస్‌ల సజావుగా ఆపరేషన్ జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఎంపిక చేసిన డిపోలలో అప్‌స్ట్రీమ్ హై-టెన్షన్ (HT) విద్యుత్ కనెక్షన్‌లను సకాలంలో ఏర్పాటు చేస్తుంది.

PM e-DRIVE పథకం కింద వాటాదారులు, OEMల నుండి అంచనాలు.. e-Bus సరఫరా, కార్యకలాపాల కోసం డెలివరీ సమయపాలనకు ఖచ్చితంగా కట్టుబడి ఉండటం. పేర్కొన్న సమయం లోపు దిగువన ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పూర్తి చేయడం. సమర్థవంతమైన e-Bus ఆపరేషన్, నిర్వహణ కోసం అర్హత కలిగిన డ్రైవర్లు మరియు సాంకేతిక నిపుణులను నియమించడం. విశ్వసనీయత, సేవా నాణ్యత పరంగా డీజిల్ బస్సులతో సమానమైన పనితీరు స్థాయిలను సాధించడం చేయాలని అధికారులు వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్టీసీ అధికారులు, ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.

Next Story