అభిషేక్ బోయినపల్లికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్

by Disha Web Desk |
అభిషేక్ బోయినపల్లికి 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో నిందితుడు అభిషేక్ బోయినపల్లికి సీబీఐ ప్రత్యేక కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అభిషేక్ బోయినపల్లికి ఇవాళ ఈడీ కస్టడీ ముగియడంతో అభిషేక్‌ను ఈడీ అధికారులు, సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో వాదనలు విన్న న్యాయస్థానం ఈ కేసులో ఈడీ విచారణ కొనసాగుతున్నందున రెండు వారాల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొంది. మరో నిందితుడు విజయ్ నాయర్‌ను మరో 4 రోజులు కస్టడీకి అప్పగించాలని ఈడీ అధికారులు కోర్టును కోరారు. దీంతో, విజయ్ నాయర్ కు రెండ్రోజుల పాటు కస్టడీని పొడగిస్తూ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఈ కేసులో ఇతర నిందితులు శరత్ చంద్రారెడ్డి, బినోయ్ బాబులకు జైలులో ఇంటి నుంచి తెచ్చే ఆహారం అందించేందుకు ప్రత్యేక కోర్టు జడ్జి నిరాకరించారు. జైలు నిబంధనల ప్రకారం ఇంటి భోజనం అనుమతించడం కుదరదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఏదైనా కావాలనుకుంటే జైలు అధికారులకు చెప్పి చేయించుకోవాలని సూచించారు. కొన్ని పుస్తకాలు తెచ్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని నిందితుల తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అందుకు న్యాయమూర్తి స్పందిస్తూ, జైలులో అన్ని పుస్తకాలు దొరుకుతాయని బదులిచ్చారు.


Next Story

Most Viewed