అనుమతిలేని పాఠశాలతో మోసం.. 10 పరీక్ష రాయని విద్యార్థులు

by Dishafeatures2 |
అనుమతిలేని పాఠశాలతో మోసం.. 10 పరీక్ష రాయని విద్యార్థులు
X

దిశ‌, జహీరాబాద్: గుర్తింపులేని పాఠశాల యాజమాన్యం నిర్వాకంతో ఎనిమిది మంది పదో తరగతి విద్యార్థులు మోసపోయారు. టెన్త్ పరీక్షలు రాసేందుకు వీరు నోచుకోలేదు. అయినా ప్రత్యేక అనుమతితో పరీక్షలు రాయిస్తానంటూ ప్రిన్సిపాల్ వారిని ఇంకా బుకాయిస్తూనే ఉన్నాడు. చివరికి జరిగిన మోసాన్ని గుర్తించిన విద్యార్థులు తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులతో సహా పోలీసులను ఆశ్రయించిన ఘటన జహీరాబాద్ పట్టణంలోని ఆక్స్ ఫర్డ్ ఉన్నత పాఠశాలలో చోటుచేసుకుంది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మోసాన్ని గ్రహించకపోవడంతో ఎనిమిది మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయి. బాధితుల్లో బసంత్‌పూర్ ధనరాజ్, అహ్మద్ నగర్ సమీర్, దత్తగియోనికాలనీ రాహుల్, పాస్తాపూర్ ఇస్మాయిల్, రాంనగర్ అక్బర్, సానియా, మన్నపూర్ దీనా, మామ్‌నగర్ అర్షియా ఉన్నారు.

ఈ విషయమై ప్రిన్సిపాల్ ను సంప్రదించగా ప్రత్యేక అనుమతితో పరీక్షలు రాయిస్తానని ఇప్పటికీ నమ్మిస్తూనే ఉన్నాడు. మోసపోయామని గ్రహించిన ఎనిమిది మంది విద్యార్థులు విధిలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులతో కలిసి పోలీసులను ఆశ్రయించి, తమకు న్యాయం చేయాలని లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేశారు. స్పందించిన ఎస్సై శ్రీకాంత్ ఆక్స్ ఫర్డ్ పాఠశాలలో పదవ తరగతి చదివినట్లు ఇందుకు సంబంధించిన ఆధారాలు తీసుకొని రావాలని వారికి సూచించారు. తన వల్ల అయింది చేస్తానన్నారు. ఆక్స్ఫర్డ్ పాఠశాలకు గుర్తింపు లేదని , పలుమార్లు యాజమాన్యం, విద్యార్థులకు ఈ విషయమై హెచ్చరించడం జరిగిందని మండల విద్యాధికారి బసవరాజ్ వివరించారు. మొదటి, రెండో టర్మ్ పరీక్షలు రాయించకపోవడంతో విద్యార్థులు ప్రిన్సిపాల్ ను పలుమార్లు నిలదీశారు. దీంతో సదరు ప్రిన్సిపాల్ అవసరంలేదని ప్రత్యేక అనుమతితో నేరుగా ఫైనల్ పరీక్షలు రాయిస్తానని నమ్మబలకుతూ వచ్చింది. చివరిగా చేతులెత్తేసి విద్యార్థుల జీవితాలను బుగ్గి పాలు చేసింది.

10 సంవత్సరాలుగా ఇక్కడే..

ఆక్స్ ఫర్డ్ ప్రైవేట్ ఉన్నత పాఠశాలకు జహీరాబాద్ లో ప్రత్యేక గుర్తింపు ఉంది. పురాతనమైన ఈ పాఠశాల యాజమాన్య వైఖరి కారణంగా కాలక్రమేణా ఆ గుర్తింపును కోల్పోయింది. చివరిగా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకునే స్థాయికి దిగజారింది. పాఠశాలకు ఉన్న పేరును దృష్టిలో ఉంచుకుని పది సంవత్సరాల క్రితం ఒకటవ తరగతిలో చేరిన విద్యార్థుల సైతం ప్రస్తుతం మోసపోయిన వారిలో ఉన్నారు. ఇదిలా ఉండగా తమ పరిస్థితి ఏమిటని నిలదీసిన విద్యార్థులు, తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ నుంచి నిరాశ దీనకమైన సమాధానమే వచ్చింది. ఎక్కడికి వెళ్లినా, ఎవరికి ఫిర్యాదు చేసినా, ఏం కాదని తాను పరీక్ష రాయిస్తానంటూ సదరు ప్రిన్సిపాల్ బుకాయిస్తూనే ఉందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

చర్యలకు డిమాండ్

ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాల నడుపుతూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న సదరు ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సామాజిక కార్యకర్తలు శ్రీనివాస్, వాసునాయక్, విద్యార్థుల తల్లిదండ్రులు యేసు, సబిత తదితరులు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.

బాబు బాధపడుతున్నాడు: విద్యార్థి రాహుల్ తల్లి సబిత

మూడు రోజుల నుంచి చాలా బాధపడుతున్నాడు. తిండి తిప్పలు లేకుండా తిరుగుతున్నాడు. ఫీజులు సక్రమంగానే కట్టాం. పరీక్ష మాత్రం రాయిస్తలేదు తమకు ఏదైనా దారి చూపి న్యాయం చేయాలి అంటూ రాహుల్ తల్లి సబిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు అడిగినా ప్రిన్సిపాల్ పరీక్ష రాయిస్తా అంటుంది

పరీక్షలు రాసేలా చూడండి: విద్యార్థిని దీనా తండ్రి యేసు

పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ ను పదిరోజులుగా అడుగుతున్నా. ఎప్పుడు అడిగినా పరీక్షలు రాయిస్తా అంటుంది. నాలుగు పరీక్షలు అయిపోయిన ఇంకా అదే మాట చెబుతోంది. ఏం చేయాలో తోచక పోలీస్ స్టేషన్ వచ్చామని దీనా తండ్రి యేసు వాపోయారు. పరీక్షలు రాసేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Next Story

Most Viewed