ఏపీ దూకుడు.. ఆపండి అంటూ తెలంగాణ లేఖ

by  |
Krishna River
X

దిశ, తెలంగాణ బ్యూరో : కృష్ణా జలాల వినియోగంలో ఏపీ దూకుడు మీదుంది. కేటాయించిన నీటి కంటే అదనంగా వాడుకునేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం బోర్డుకు లేఖ పంపింది. కృష్ణా జలాల వాటాలో ఏపీ ఇంకా కేవలం 11.52 టీఎంసీలు వాడుకోవాల్సి ఉందని, ఏపీని నియంత్రించాలని స్పష్టం చేసింది. కృష్ణా బేసిన్‌లో ఈ ఏడాది నీటి లభ్యత ప్రకారం 914.5 టీఎంసీల్లో ఏపీ, తెలంగాణ 66:34 నిష్పత్తి ప్రకారం వాడుకోవాల్సి ఉంది. దీనిలో భాగంగా ఏపీ 603.27 టీఎంసీలు, తెలంగాణ 310.77 టీఎంసీల వాటా కేటాయించారు. అయితే ఇప్పటి వరకు తెలంగాణ వినియోగంలో వెనకబడింది. ఏపీ వివిధ ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాల్వల ద్వారా 553.28 టీఎంసీలను తరలించుకుపోయింది.

కానీ తెలంగాణ మాత్రం 187.9 టీఎంసీలే తీసుకుంది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డుకు వివరించింది. కృష్ణా బేసిన్‌లో చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టుల్లో ఏపీలో 38.46 టీఎంసీలు, తెలంగాణలో 10.90 టీఎంసీలు నిల్వ ఉన్నాయని, ఇప్పటి వరకూ వినియోగించిన జలాలు, నిల్వ ఉన్న నీటిని కలిపితే ఏపీ 591.75 టీఎంసీలు, తెలంగాణ 198 టీఎంసీలు వాడుకున్నట్లు వివరించారు. దీని ప్రకారం నీటి వినియోగాన్ని పరిగణలోకి తీసుకోవాలని, శ్రీశైలం, సాగర్​ జలాశయాల్లో నిల్వల ప్రకారం ఏపీ కోటా 11.52 టీఎంసీలు మాత్రమేనని, తెలంగాణకు ఇంకా 112.77 టీఎంసీలు ఉందని వివరించారు.

అయితే, ప్రతిసారి ఏదో లెక్కలతో ఏపీ ప్రభుత్వం ఎక్కువగా కృష్ణా జలాలను వాడుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తంగా ముందస్తు లేఖ రాసింది. అయితే బోర్డు కూడా పలు సందర్భాల్లో ఏపీకి మద్దతుగా ఉన్నట్లే వ్యవహరిస్తోంది. లెక్కకు మించి నీటిని తరలించుకుంటున్నా లేఖ పంపి చేతులెత్తేస్తోంది. ఈసారి కూడా అదే విధంగా చేస్తుందా అనే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి. పోతిరెడ్డిపాడు, కేసీ కాల్వ పరిధిలో మరోసారి నీటిని విడుదల చేసేందుకు కర్నూల్​ఇరిగేషన్​ శాఖ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో మరిన్ని టీఎంసీలు అవసరముంటాయి. కానీ ఇప్పుడున్న 11 టీఎంసీలు సరిపోవు. దీంతో ఎక్కువగా తరలించేందుకు ప్లాన్​ వేస్తున్నట్లు తెలుస్తున్నది. దీన్ని బోర్డు అడ్డుకుంటుందా? లేదా? అనేది వేచిచూడాలి.

Next Story

Most Viewed