సచివాలయం టెండర్లు ఫైనల్ !

by  |
సచివాలయం టెండర్లు ఫైనల్ !
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయ నిర్మాణ పనుల టెండర్ల ప్రక్రియను మరో నాలుగైదు రోజుల్లో అగ్రిమెంట్ చేయనున్నారు. పాత సచివాలయ కాంప్లెక్స్ స్థానంలో నూతనంగా నిర్మాణాన్ని చేపట్టేందుకు ఆర్అండ్‌బీ శాఖ రూ.500కోట్లతో టెండర్లు పిలిచింది. గతనెల 24నుంచి ఆన్‌లైన్ టెండర్లకు నోటిఫికేషన్ జారీ చేసి ఈనెల 13వరకు టెండర్ బిడ్ల స్వీకరణకు గడువు విధించారు. దీనిలో భాగంగా ఈనెల 7న ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించగా… ఐదు నిర్మాణ సంస్థలు పాల్గొన్నాయి. దీనిలో సదరు సంస్థలు పలు డిమాండ్లు ముందుంచాయి. 12నెలల నిర్మాణ కాలం సరిపోదని, 18నెలలకు పెంచాలని, మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని, ప్రతినెలా బిల్లులు చెల్లించాలంటూ ప్రతిపాదనలు చేశారు. కానీ వీటిని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు.

వాస్తవంగా ఈనెల 16న సాంకేతిక బిడ్లు తెరువాల్సి ఉండగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఈనెల 20కి వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 20న సాంకేతిక బిడ్లు తెరిచిన అధికారులు షాపూర్జీ పల్లాంజీ, ఎల్ఎండ్‌టీ సంస్థలు వేసిన బిడ్లను అర్హత సాధించినట్లు వెల్లడించారు. డాక్యుమెంట్లు, అర్హత ప్రమాణాలను పరిశీలించి ఈ రెండు సంస్థల ప్రైస్ బిడ్లను ప్రకటించారు. నిబందనల ప్రకారం ప్రైస్ బిడ్ల వివరాలను కమిషనర్ ఆఫ్ టెండర్స్ (సీఓటీ)కి పంపించామని అర్అండ్‌బీ ఈఎన్సీ చెప్పారు. సీఓటీ పరిశీలన తర్వాత ఏ సంస్థ ఎంతకు టెండర్లు వేసింది, ఎల్-1 ఎవరనే వివరాలను ప్రకటిస్తామన్నారు. అయితే ఇప్పటికే కొత్త సచివాలయ నిర్మాణ టెండర్లు ఎల్అండ్‌టీ సంస్థకు ఖరారయ్యాయని ప్రచారం సాగుతోంది. పండుగ తర్వాత బుధవారం టెండర్లను ఫైనల్ చేసి ఎల్అండ్‌టీకి అగ్రిమెంట్ చేస్తారని ఆఫ్ ది రికార్డుగా చెప్పుతున్నారు.

Next Story