సైబర్​ నేరాల్లో నాలుగో స్థానంలో తెలంగాణ

by  |
సైబర్​ నేరాల్లో నాలుగో స్థానంలో తెలంగాణ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సైబర్​క్రైం దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతినిత్యం ఏదో ఒక చోట ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏటేటా ఈ తరహా దాడుల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయి. 2018లో దేశవ్యాప్తంగా జరిగిన నేరాల సంఖ్య 27,248గా నమోదయ్యాయి. 2019లో ఈ సంఖ్య 44,735కు పెరిగింది. 2020 నాటికి ఈ నేరాలు 50,035కు చేరుకున్నాయి. 2019తో పోలిస్తే 2020 నాటికి 11.8 శాతం పెరిగినట్లు నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో(ఎన్​సీఆర్​బీ) ఇచ్చిన నివేదికలో తేలింది. ఈ కేటగిరీ కింద నేరాల రేటు దేశవ్యాప్తంగా 3.3 నుంచి 3.7కి పెరిగింది. 2020లో నమోదైన 50,035 సైబర్​ నేరాల కేసుల్లో 60.2(30,142 కేసులు) శాతం మోసానికి చెందినవే ఉన్నాయి. లైంగిక నేరాలకు సంబంధించి 3,293 కేసులతో 6.6 శాతం నమోదైంది. దోపిడీలకు సంబంధించి 2,440 కేసులతో 4.9 శాతం నమోదైంది.

తెలంగాణలో ఈ తరహా నేరాలు మరింత ఎక్కువయ్యాయి. 2018లో 1,205 ఘటనలు చోటుచేసుకున్నాయి. 2019లో సైబర్​ దాడులు 2,691గా నమోదయ్యాయి. ఇదిలా ఉండగా 2020లో ఏకంగా 5,024కు చేరుకున్నట్లు నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో ఇచ్చిన నివేదికలో తేలింది. ఈ నేరాల రేటు 13.4 శాతంగా నమోదైంది. చార్జీషీట్ చేసిన నేరాలు 42.5 శాతంగా తేలింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే తెలంగాణలో అత్యధికంగా సైబర్​ నేరాలు జరుగుతున్న ప్రాంతాల్లో నాలుగో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలవగా.. 2020లో 11,097 కేసులు నమోదైనట్లు నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో నివేదికలో పేర్కొంది. 10,741 సైబర్​దాడులతో రెండోస్థానంలో కర్ణాటక నిలిచింది. మహారాష్ట్రలో 5,496 నేరాలతో మూడో స్థానంలో ఉంది.

రాష్ట్రంలో కంప్యూటర్​ఆ ధారిత మోసాల సంఖ్య 111గా ఉన్నట్లు నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో ఇచ్చిన నివేదికలో తేలింది. ప్రైవసీకి భంగం కలిగించిన ఘటనలు 4 ఉండగా మహిళలను అసభ్యకర మెసేజులతో లైంగికంగా వేధించిన నేరాల సంఖ్య 97గా నమోదైంది. ఐటీ యాక్ట్​కింద నమోదైన నేరాలు 306గా నివేదికలో తేలింది. మహిళలు, చిన్నారులకు సైబర్​ బెదిరింపులు చేసిన నేరాలు 100 గా నమోదయ్యాయి. ఫ్రాడ్​ కేసులకు సంబంధించిన నేరాలు 3,316, క్రెడిట్, డెబిట్​కార్డులకు సంబంధించినవి 252 నేరాలుగా నమోదయ్యాయి. కంప్యూటర్​ఆధారిత అఫెన్స్​లు అత్యంత ఎక్కువగా జరుగుతున్నాయి.

మెట్రో పాలిటన్ సిటీల్లోనూ సైబర్​ క్రైమ్​ నేరాలు ప్రతి ఏటా విచ్చలవిడిగా పెరుగుతున్నాయి. 2018లో 428 నేరాలు నమోదైతే, 2019లో 1,379, 2020లో 2,553 గా నమోదయ్యాయి. ప్రతిలక్ష మంది ప్రాతిపదికన తీసుకుంటే తెలంగాణలో జరుగుతున్న సైబర్​ నేరాల రేటింగ్​ 32.9 శాతంగా ఉన్నట్లు నేషనల్​ క్రైమ్​ రికార్డ్స్​ బ్యూరో నివేదికలో తేలింది. అత్యధిక సైబర్​ నేరాలు జరిగే మెట్రో పాలిటన్​నగరాల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. కాగా మొదటిస్థానంలో కర్ణాటక ఉంది.


Next Story

Most Viewed