అందులో తెలంగాణ 1వ స్థానం.. ఏపీ 13వ స్థానం

by  |
అందులో తెలంగాణ 1వ స్థానం.. ఏపీ 13వ స్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పథకాల్లో మిషన్ భగీరథ ఒకటి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ మంచినీరు అందించాలనే లక్ష్యం పెట్టుకున్నారు. ప్రస్తుతం ఈ పథాకానికి దేశస్థాయిలో అత్యంత గౌరవం దక్కింది. దేశంలో నల్లా కలెక్షన్ల ద్వారా నీరు సరఫరా చేయడంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో… తెలంగాణలో 98.31 శాతం ఇళ్ళకు మంచి నీటి నల్లా కనెక్షన్లు ఉన్నట్టు వెల్లడైంది.

తెలంగాణ రాష్ట్రం 98.31 శాతం ఇళ్ళకు నల్లాలతో తాగునీటిని అందిస్తూ దేశంలోనే తొలిస్థానంలో నిలిచిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ జల్‌ జీవన్‌ మిషన్‌ వివరాలను ప్రకటించింది. తెలంగాణలో మొత్తం 54.38 లక్షల ఇళ్లుండగా వాటిల్లో 53.46 లక్షల ఇళ్లకు తాగునీరు అందుతోంది.

తెలంగాణ తరువాత 89.05 శాతంతో గోవా రాష్ట్రం రెండో స్థానంలో నిలవగా, 87.02 శాతంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదిచ్చేరి మూడో స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌ మాత్రం ఈ జాబితాలో కేవలం 34.62 శాతంతో 13 వ స్థానంలో నిలిచింది.

‘‘కేంద్ర జల శక్తి నివేదిక మేరకు… తెలంగాణ 98.31 శాతం నల్లాల కనెక్షన్లతో తాగునీరు అందిస్తూ తొలిస్థానంలో నిలిచింది. మిషన్ భగీరథ ద్వారా ఈ తాగునీరు అందుతోంది. ఈ అద్భుత విజయానికి కారణమైన సీఎం కేసీఆర్ దూరదృష్టికి, కష్టపడి పనిచేసిన ఆర్‌డబ్ల్యూఎస్‌ టీమ్‌కు అభినందనలు’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed