కేసీఆర్ వల్లే అరేళ్లలో నూరేళ్ళ అభివృద్ధి జరిగింది

by  |
కేసీఆర్ వల్లే అరేళ్లలో నూరేళ్ళ అభివృద్ధి జరిగింది
X
  • ఏం చేశారని… ఏ ముఖం పెట్టుకొని ఓట్లు ఆడిగేందుకు వస్తున్నారు
  • నయా జమీందారి వ్యవస్థను ప్రోత్సహిస్తున్నారు
  • మీ నిర్ణయాలు నచ్చకనే మీ కేంద్ర మంత్రి కూడా రాజీనామా
  • బీజేపీ పార్టీపై రాష్ట్ర ఆర్ధికమంత్రి హరీష్ రావు ఫైర్

దిశ,సిద్దిపేట: ప్రజల సంక్షేమం కోసం బీజేపీ పార్టీ ఒక్క మంచి పనైనా చేసిందా ఏనాడైనా ప్రజల కోసం ఆలోచించారా రైతులు నష్టపోయేలా వ్యవహరిస్తున్నది మీరు కాదా తెలంగాణకు మీ వల్ల ఒరిగిందేమిటి మళ్ళీ ఏ ముఖాలు పెట్టుకొని ఓట్లడగడానికి వస్తున్నారు అంటూ బీజేపీ పార్టీ విధానాలపై రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం రోజున మిరుదొడ్డి మండలంకు చెందిన మాజీ ప్రజాప్రతినిధులు, ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆరెస్ పార్టీలో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని మంత్రి హరీష్ రావు గారు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు మంచి చేయపోగా వారి పొట్టకొట్టే నిర్ణయాలు తీసుకోవడం బీజేపీకే చెల్లుతుందని అన్నారు. మోటర్లకు మీటర్లు పెట్టడం ఆ ప్రభుత్వంలోని మంత్రులకే న్యాయంగా అనిపించలేదని, అందుకే రాజీనామా చేశారని గుర్తు చేశారు. కార్పొరేట్ సంస్థల చేతికి రైతుల బతుకులను అప్పగించే ప్రమాదకరమైన ఆలోచనకు కేంద్రం తెరతీసిందని అన్నారు. మన దేశంలోనే 280 లక్షల మెట్రిక్ టన్నుల మక్కలు ఉత్పత్తి అవుతాయని, ఇందులోనే పుష్కలంగా మక్కలను విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉందని వివరించారు. కానీ విదేశాల నుండే మక్కలను దిగుమతి చేయడానికి కేంద్రం పెద్దలు సంతకాలు చేసి వచ్చారని హరీష్ రావు ఆరోపించారు. దేశంలో బీజేపీ ఎలాంటి సంక్షేమం చేయలేదని, అదే సంక్షేమంలో ముందుకెళ్తున్న తెలంగాణను అనగదొక్కే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను మిగితా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ప్రతీ అడుగు రైతుల కోసమేనని చెప్పారు. అరేళ్లలోనే నూరేళ్ళ అభివృద్ధిని చేసి చూపించిన ఘనత ఈ తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందని వివరించారు. దొంగ రాత్రి కరెంటు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్స్, కాలిపోయే మోటార్లు, ఎరువులు, విత్తనాల కోసం చెప్పులు లైనులో పెట్టే చరిత్రను కనుమరుగు చేశామని స్పష్టం చేశారు. తొలి ఏడాదిలో మిషన్ కాకతీయ, 2వ ఏడాదిలో 24 గంటల ఉచిత విద్యుత్, 3వ ఏడాదిలో రైతు బంధు, 4వ ఏడాదిలో రైతు భీమా, 5వ ఏడాదిలో కాళేశ్వరం నీళ్లు, ఇప్పుడు కొత్త రెవెన్యూ చట్టం ఈ ప్రభుత్వం సాధించిన గొప్ప విషయాలు అని అన్నారు. మెడిగడ్డ నుండి మిరుదొడ్డికి 15 తాటిచెట్ల ఎత్తుకు నీళ్లు తెచ్చామని హరీష్ రావు చెప్పారు. బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ కు చెందిన మాజీ మంత్రి జానారెడ్డి లు కూడా తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులేనని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా సంక్షేమం, అభివృద్ధిని చేపట్టిన ఘనత కేవలం కేసీఆర్ కే దక్కుతుందని పేర్కొన్నారు. గ్రామాల్లో కనిపిస్తున్న స్పష్టమైన మార్పే మా ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులకు డిపాజిట్ గల్లంతు అవుతేనే మన గెలుపునకు సార్థకత దక్కుతుందని అన్నారు.

టీఆరెస్ పార్టీలోకి భారీగా చేరికలు

దుబ్బాక నియోజకవర్గంలోని మిరుదొడ్డి మండలంలో గల అందె, చెప్యాల, మల్లుపల్లి తదితర గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో టీఆరెస్ పార్టీలో చేరారు. వీరిలో మాజీ జడ్పిటిసి నర్మల చంద్రం, చెప్యాల మాజీ సర్పంచ్ డి.కోమల, రిటైర్డ్ ఎస్.ఐ లక్ష్మన్, చెప్యాల ఉప సర్పంచ్ బాల్ రెడ్డి, గౌడ సంఘం అధ్యక్షుడు రాజ్ గౌడ్ టీఆరెస్ లో చేరారు. అదేవిధంగా మంత్రి హరీష్ రావు సమక్షంలో తొగుట మండలం జప్తిలింగారెడ్డి పల్లి లో trs లో చేరిన కాంగ్రెస్ సొసైటీ సభ్యుడు యెన్నం మహిపాల్ రెడ్డి, ముదిరాజ్ సంఘం సభ్యులు.. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై టీఆరెస్ లో చేరిన వారందరికీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. కష్టపడిన ప్రతీ కార్యకర్తకు టీఆరెస్ పార్టీలో గుర్తింపు ఉంటుందని సూచించారు. వచ్చే మూడేళ్ళలో ఏ అవసరం వచ్చినా తనను కలవొచ్చని పేర్కొన్నారు. గ్రామాల్లో సైనికుల వలె ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు.

Next Story

Most Viewed