తెలంగాణ ఓపెన్ 2021 పీజీటీఐ సీజన్ పున:ప్రారంభం

by  |
golf
X

దిశ, శేరిలింగంపల్లి : హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ (హెచ్‌జీఎ), ప్రొఫెషనల్ గోల్ఫ్ అధికారిక నియంత్రణ, సమన్వయ సంస్థ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ ఆఫ్ ఇండియా (పీజీటీఐ) సంయుక్త ఆధ్వర్యంలో వూటీ అండ్ హల్దీ గోల్కొండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్ 2021 పీజీటీఐ సీజన్‌ను పున: ప్రారంభిస్తున్నట్లు ప్రకటించాయి. సెప్టెంబర్ నుంచి 25 రోజుల పాటు జరగనున్న ఈ సీజన్ టోర్నమెంట్‌లో 129 మంది గోల్ఫర్లు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ యూత్ అడ్వాన్స్‌మెంట్, పర్యాటకం, సాంస్కృతికశాఖ కార్యదర్శి కె. ఎస్ శ్రీనివాస రాజు మాట్లాడుతూ, గోల్కొండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్ 7వ ఎడిషన్‌తో అనుబంధం మాకెంతో గర్వకారణమని, తెలంగాణ, హైదరాబాద్ పర్యాటకం గురించి చాటిచెప్పేందుకు ఇదో గొప్ప అవకాశమన్నారు.

ప్రపంచ ప్రఖ్యాత, చారిత్రక గోల్కొండ కోట నేపథ్యంగా రూపుదిద్దుకున్న హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ అగ్రగామి గోల్ఫింగ్ గమ్యస్థానమని చాటిచెప్పే అవకాశముందన్నారు. వూటీ గోల్ఫ్ కౌంటీ, హల్ది గోల్ఫ్ కౌంటీ సీఈఓ కె. పృథ్వీ రెడ్డి మాట్లాడుతూ, వరుసగా నాలుగో ఏడాది కూడా పీజీటీఐ గోల్కొండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్ నిర్వహిస్తున్నామని, వూటీ గోల్ఫ్ కౌంటీ, హల్దీ గోల్ఫ్ కౌంటీల గురించి తెలియజేసేందుకు ఈ టోర్నమెంట్ మాకు ఓ చక్కటి వేదికను అందించిందన్నారు.

గోల్ఫ్ క్రీడ దిశగా హైదరాబాద్‌తో పాటుగా తెలంగాణ యువతను ఆకట్టుకోవడంలో, భవిష్యత్ గోల్ఫర్స్‌ను రూపొందించడంలో ఈ కార్యక్రమం ఎంతో కీలక పాత్ర వహిస్తుందన్నారు. పీజీటీఐ సీఈఓ ఉత్తమ్ సింగ్ ముండే 2020-21 టీటా స్టీల్ పీజీటీఐ సీజన్‌ను వూటీ, హల్దీ సమర్పణలో గోల్కొండ మాస్టర్స్ తెలంగాణ ఓపెన్‌తో పునః ప్రారంభమవుతుందని తెలిపారు. ఈవెంట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్థాయి గోల్ఫర్లు పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు.


Next Story

Most Viewed