నీటి తరలింపుపై ఏపీని కట్టడి చేయండి.. కేఆర్​ఎంబీకి తెలంగాణ లేఖ

by  |
నీటి తరలింపుపై ఏపీని కట్టడి చేయండి.. కేఆర్​ఎంబీకి తెలంగాణ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా ఏపీ ప్రభుత్వం శ్రీశైలం జలాలు తరలించకుండా ఆపాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదీ యాజమాన్య బోర్డును కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదలశాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ కేఆర్ఎంబీ ఛైర్మన్‌కు బుధవారం లేఖ రాశారు. ఈ నెల 8న రాసిన లేఖకు కొనసాగింపుగా తాజా లేఖ రాస్తున్నట్టు పేర్కొన్నారు. 2021–22 నీటి సంవత్సరంలో జూన్ ఒకటో తేదీ నుంచి ఈ నెల 20 వరకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 76.39 టీఎంసీలు, హంద్రీనీవా ద్వారా 9.22 టీఎంసీల నీటిని ఏపీ తరలించినట్టు లేఖలో వివరించారు.

ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీశైలం నుంచి ఏపీ 85.66 టీఎంసీలు, తెలంగాణ 7.47 టీఎంసీల నీటిని తీసుకున్నట్టు పేర్కొన్నారు. 1976 అంతర్ రాష్ట్ర ఒప్పందం, 1981 కేంద్ర జలసంఘం ఆమోదం ప్రకారం శ్రీశైలంలో 880 అడుగులకు పైన నీరు ఉన్నప్పుడు మాత్రమే బేసిన్ వెలుపలకు 34 టీఎంసీల నీటిని మాత్రమే మళ్లించాలని, అందుకు భిన్నంగా ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది ఇప్పటికే 85.67 టీఎంసీల నీటిని మళ్లించిందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హెచ్ఎస్ఎస్ఎస్ నుంచి ఏపీ నీరు విడుదల చేయకుండా తక్షణమే ఆపాలని కృష్ణాబోర్డును కోరారు. వాటాకు విరుద్ధంగా వరద సమయంలో ఏపీ మళ్లించిన జలాలను లెక్కించాలని విజ్ఞప్తి చేశారు. అటు తెలంగాణ కోటాలో మిగిలిన జలాలను ఉమ్మడి జలాశయాల్లో నిల్వ ఉండే నీటి నుంచి వచ్చే ఏడాదికి వినియోగించుకునేందుకు అనుమతించాలని ఈఎన్‌సీ.. కేఆర్ఎంబీని కోరారు.



Next Story

Most Viewed