TS సర్కార్‌కు హైకోర్టు షాక్.. CS ఉత్తర్వులపై స్టే

by  |
Telangana High Court
X

దిశ, తెలంగాణ బ్యూరో: సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అక్టోబరు 13న జారీ చేసిన సర్క్యూలర్ అమలుకు హైకోర్టు స్టే విధించింది. ఆర్టీఐ చట్టం స్ఫూర్తికి విరుద్ధంగా సీఎస్ నిర్ణయాలు తీసుకోడాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ శర్మ నేతృత్వంలోని బెంచ్ తప్పుపట్టింది. ఈ సర్క్యూలర్‌లోని అంశాలను అమలు చేయవద్దంటూ ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. సీఎస్ సర్క్యూలర్‌లోని అంశాలను సవాలు చేస్తూ ఆర్టీఐ కార్యకర్త గంజి శ్రీనివాసరావు సహా పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను సోమవారం విచారించిన సీజే నేతృత్వంలోని ధర్మాసనం తదుపరి ఉత్తర్వులను వెలువరించేంత వరకు అమలుచేయవద్దని సీఎస్‌ను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది.

ఆర్టీఐ చట్టం కింద వచ్చే దరఖాస్తులకు సమాధానం ఇచ్చే ముందు విధిగా ఆయా శాఖల ఉన్నతాధికారుల నుంచి పీఐఓ (పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు అనుమతి తీసుకోవాల్సిందిగా అన్ని శాఖలకూ సీఎస్ అక్టోబరు 13న సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యూలర్ రూపంలో లేదా మరే రకమైన లిఖితపూర్వక ఆదేశాలు జారీచేసే అధికారం ప్రధాన కార్యదర్శికి లేదని గంజి శ్రీనివాసరావు తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇలాంటి ఉత్తర్వులు ఇవ్వడం ఆర్టీఐ చట్టంలోని నిర్దిష్ట కాలపరిమితిలోపు దరఖాస్తుదారునికి సమాచారం ఇవ్వాలన్న నిబంధనను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. సీఎస్ జారీ చేసిన నోట్‌ ఆర్టీఐ చట్ట స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు.


Next Story

Most Viewed