ఏడాది దాటింది.. కౌంటర్ ఎందుకివ్వలేదు: హైకోర్టు

by  |
ఏడాది దాటింది.. కౌంటర్ ఎందుకివ్వలేదు: హైకోర్టు
X

దిశ, తెలంగాణ బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల ప్రక్రియపై ఏడాది కాలం దాటినా ప్రభుత్వం కౌంటర్ పిటిషన్‌ను ఎందుకు దాఖలు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఇకనైనా కౌంటర్ పిటిషన్ వేస్తుందా? లేక ఆర్డర్ ఇవ్వమంటారా? అని చీఫ్ జస్టిస్ హిమా కోహ్లి ప్రశ్నించారు. స్థానిక సంస్థల వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియపై ప్రభుత్వ తీరును సవాలు చేస్తూ బడంగ్‌పేటకు చెందిన కుమరేశ్ దాఖలు చేసిన పిటిషన్‌ను మంగళవారం విచారించిన చీఫ్ జస్టిస్.. రెండు నెలల్లోగా కౌంటర్ దాఖలు చేయడానికి ప్రభుత్వానికి సూచించింది.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది వాదిస్తూ, గతేడాది నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వార్డుల విభజన, రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం సరైన తీరులో స్పందించలేదని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో లాటరీ సిస్టమ్‌ను తీసివేయాలని కోరారు. దీనిపై స్పష్టమైన విధానాన్ని, వైఖరిని వెల్లడించడానికి సైతం ప్రభుత్వం సిద్ధంగా లేదని, ఏడాది క్రితం పిటిషన్ దాఖలు చేసినా ప్రభుత్వం నుంచి నేటికీ వివరణ రాలేదని తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి కొంత గడువు ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరడంతో 2 నెలల పాటు గడువు ఇవ్వడానికి హైకోర్టు గడువు ఇచ్చింది. గతంలోనూ కౌంటర్ దాఖలు చేయాలంటూ హైకోర్టు ఆదేశించినా.. ప్రభుత్వం ఇప్పటికీ దాఖలు చేయలేదని, ఈసారి సైతం అలాంటివి పునరావృతం కారాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణను 2 నెలల తర్వాతకు వాయిదా వేసింది.



Next Story