రోజు ఇరవై మందికి భోజనం పెట్టండి.. హైకోర్టు వినూత్న శిక్ష

by  |
రోజు ఇరవై మందికి భోజనం పెట్టండి.. హైకోర్టు వినూత్న శిక్ష
X

దిశ, తెలంగాణ బ్యూరో: సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పును ధిక్కరించిన కేసులో హైకోర్టు బెంచ్ శుక్రవారం ఆస‌క్తిక‌ర‌మైన శిక్ష విధించింది. మసీదు దగ్గర ఉపవాస దీక్షలు ముగించిన ముస్లిం సోదరులకు ప్రతీరోజు ఇరవై మందికి భోజనాలు పెట్టాలని, రంజాన్ మాసంలో వారం రోజుల పాటు దీన్ని అమలు చేయాలని ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ కమిషనర్‌ను హైకోర్టు ఆదేశించింది. గతంలో కోర్టు ధిక్కరణ కేసులో సింగిల్ జడ్జి బెంచ్ ఇచ్చిన తీర్పుపై అప్పీల్ చేసినందుకు హైకోర్టు ఈ శిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్ ఎక్సయిజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ యాసిన్ ఖురేషీ గతంలో కోర్టు ఆదేశాలను ధిక్కరించినందుకు సింగిల్ జడ్జి బెంచ్ వెయ్యి రూపాయల జరిమానా విధించింది. ఈ జరిమానాను వేతనం నుంచి కత్తిరించాల్సిందిగా అప్పట్లో సింగిల్ జడ్జి బెంచ్ స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పును సవాలు చేస్తూ యాసిన్ ఖురేషీ అప్పీలు చేశారు. వెయ్యి రూపాయలను జీతం నుంచి జరిమానాగా కత్తిరిస్తే తన కెరీర్‌‌కు మచ్చ వస్తుందని, సర్వీసు రికార్డులో రిమార్కు పడుతుందని తన అప్పీల్‌లో పేర్కొన్నారు.

దీన్ని శుక్రవారం విచారించిన హైకోర్టు బెంచ్ రంజాన్ మాసంలో రోజు ఇరవై మందికి వారం రోజుల పాటు ముస్లిం సోదరులకు భోజనాలు పెట్టించాలని, వెయ్యి రూపాయల జరిమానా శిక్షకు బదులుగా దీన్ని అమలుచేయాలని స్పష్టం చేసి కేసును పరిష్కరించింది.

Next Story