కరోనాపై 21 'పిల్'లు క్లోజ్

by  |
కరోనాపై 21 పిల్లు క్లోజ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: కరోనా కట్టడిపై గతేడాది మార్చి నుంచి హైకోర్టులో దాఖలైన పలు ప్రయోజన వ్యాజ్యాలను హైకోర్టు క్లోజ్ చేసింది. మూడింటిపై మాత్రం విచారణ కొనసాగించడానికి సమ్మతించింది. కరోనా కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విడివిడి వ్యక్తులు గతేడాది దాదాపు పాతిక వరకు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను దాఖలు చేశారు. వాటన్నింటిపై ఇంతకాలం విచారణ కొనసాగింది. అందులో భాగంగా గురువారం కూడా హైకోర్టు బెంచ్ ముందుకు అవి విచారణకు వచ్చాయి.

గతంతో పోలిస్తే కరోనా వైరస్ వ్యాప్తి, తీవ్రత రాష్ట్రంలో గణనీయంగా తగ్గిందని హైకోర్టు ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా అభిప్రాయపడింది. కరోనాకు సంబంధించి మొత్తం 24పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయని, పేర్కొని అందులో మూడు మినహా మిగిలినవాటిన్నింటినీ క్లోజ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. విచారణ సందర్భంగా బ్రిటన్ నుంచి వచ్చిన కరోనా కొత్త స్ట్రెయిన్ గురించి ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్ జనరల్‌ను హైకోర్టు బెంచ్ ప్రశ్నించింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొత్త రకం స్ట్రెయిన్ బారిన పడిన వ్యక్తులు నలుగురు మాత్రమే ఉన్నారని, వారికి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులో ఉన్న వ్యక్తులందరికీ నిర్ధారణ పరీక్షలు చేశామని, కానీ పాజిటివ్ లేదని కోర్టుకు స్పష్టం చేశారు.

వ్యాక్సినేషన్‌పై ప్రస్తుతం న్యాయస్థానాల జోక్యం అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కరోనా టెస్టుల తీరుపై మాత్రం నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇప్పటివరకు దాకలైన 24ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలపై విచారణ జరపాల్సిన అవసరం లేదని హైకోర్టు ప్రకటించింది. మూడు మినహా మిగిలిన వ్యాజ్యాలన్నింటిపై కోర్టు విచారణను ముగించింది. మూడు పిటిషన్లపై మాత్రం తదుపరి విచారణను ఫిబ్రవరి 25వ తేదీకి వాయిదా వేసింది.


Next Story

Most Viewed