కరోనా ముప్పు ఇంకా ఉంది

by  |
కరోనా ముప్పు ఇంకా ఉంది
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రజల ఆరోగ్యం విషయంలో ఇప్పటివరకూ రాజీపడని వైద్యారోగ్య శాఖ రానున్న కాలంలో వచ్చే పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా అన్ని ముందుజాగ్రత్త చర్యలతో సిద్ధమవుతోంది. రాబోయే రెండు నెలలు సమయం చాలా కీలకమైనదని, వైద్యారోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. కరోనా ముప్పు ఇంకా పూర్తిగా పోలేదని, వాతావరణ పరిస్థితులు మారిన నేపథ్యంలో శ్వాసకోశ సంబంధ వ్యాధుల తీవ్రత పెరిగే అవకాశం ఉందని వివరించారు. అన్ని ఆసుపత్రుల్లో తగిన ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా ఆ శాఖ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో శనివారం మంత్రి సమీక్ష నిర్వహించిన సందర్భంగా పై అంశాలను ప్రస్తావించారు.

మంత్రితో సమీక్షా సమావేశం ముగిసిన అనంతరం రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. కరోనా ముప్పు తగ్గిపోయినప్పటికీ పూర్తిగా తొలగిపోలేదని, ఆ ప్రమాదం ఇంకా ఉందన్నారు. దసరా, దీపావళి పండుగలతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందనుకున్నాంగానీ ప్రజల సహకారం, ప్రభుత్వ ముందుజాగ్రత్త చర్యలతో బయటపడ్డామన్నారు. ప్రజారోగ్య విషయంలో తెలంగాణ వైద్యారోగ్యశాఖ ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని, ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో ర్యాలీలు, బహిరంగసభలు, రోడ్‌షోలు పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేవారు. ముఖ్యంగా రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తప్పనిసరిగా మాస్కు పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దేశంలోని కొన్ని నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్‌లో కరోనా కేసులు తక్కువేనని, లాక్‌డౌన్, కంటైన్‌మెంట్ చర్యలతో కట్టుదిట్టంగా వ్యవహరించామన్నారు. ప్రస్తుతం ఢిల్లీలాంటి నగరంలో సెకండ్ వేవ్ వచ్చి ఆసుపత్రుల్లో బెడ్‌లు కూడా దొరకని పరిస్థితి వచ్చిందని, హైదరాబాద్ నగరానికి అలాంటి పరిస్థితి రావద్దనే కోరుకుంటున్నామని, ప్రజలు దానికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. శీతాకాలంలో మారిన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు ఎక్కువయ్యే అవకాశం ఉందని, వైద్యపరంగా అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లపై మంత్రి ఈటల రాజేందర్ ఈ సమీక్షా సమావేశంలో నొక్కిచెప్పారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాకా అవసరమైన మందులను అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 62 ప్రభుత్వ ఆసుపత్రుల్లో 1600 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని, ఆక్సిజన్‌కు కూడా కొరత లేదని వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమేశ్‌రెడ్డి తెలిపారు.



Next Story

Most Viewed