వ్యాక్సిన్ నిల్వలున్నా.. సెకండ్ డోస్ బంద్

by  |
Vaccination
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రం నుంచి, వ్యాక్సిన్ తయారీ సంస్థల నుంచి తగినన్ని నిల్వలు రాకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఫస్ట్ డోస్, సెకండ్ డోస్ టీకాల పంపిణీ ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం నిలిపేసింది. రాష్ట్రం దగ్గర నిల్వలు లేకపోవడంతో శనివారం, ఆదివారం ‘వ్యాక్సిన్ హాలీడే‘ ప్రకటించిన ప్రజారోగ్య శాఖ సోమవారం నుంచి కొత్త మార్గదర్శకాలతో టీకాల పంపిణీ చేయనున్నట్లు పేర్కొంది. కానీ స్టాక్ రాలేదన్న కారణంతో సోమవారం నుంచి ప్రారంభించాల్సిన ప్రక్రియను కూడా నిరవధికంగా వాయిదా వేసింది. ఎన్ని రోజుల పాటు ‘వ్యాక్సిన్ హాలీడే‘ను అమలు చేయనున్నదీ వైద్యారోగ్య శాఖకు కూడా స్పష్టత లేదు. కొత్త స్టాకులు వచ్చేంతవరకు టీకాలు ఇవ్వడం వీలుకాదని ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస రావు ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రధాని మోడీ గత నెల చివరి వారంలో ‘టీకా ఉత్సవ్‘ను 18-44 ఏళ్ళ వయస్కులకు మే నెల 1వ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. అప్పటి నుంచి రాష్ట్రంలో తొలి డోస్ వ్యాక్సిన్ పంపిణీ నిలిచిపోయింది. కేవలం 45 ఏళ్ళ వయసు దాటినవారికి సెకండ్ డోస్ మాత్రమే లభిస్తోంది. అయితే తగినన్ని నిల్వలు లేకపోవడంతో కొన్ని రోజులు సెలవు ప్రకటించింది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ సెంటర్ల సంఖ్య కూడా తగ్గిపోయింది. ఏ సెంటర్‌లో వ్యాక్సిన్ ఎప్పుడు ఇస్తారో సెకండ్ డోస్ తీసుకోవాల్సినవారికి కూడా స్పష్టత లేకుండాపోయింది. తొలుత ‘కొవిన్‘ పోర్టల్‌లో స్లాట్ బుక్ చేసుకున్నవారికి మాత్రమే సెకండ్ డోస్ ఇస్తామని చెప్పిన ప్రజారోగ్య శాఖ అధికారులు ఆ తర్వాత స్పాట్ రిజిస్ట్రేషన్ ద్వారా కూడా తీసుకోవచ్చని ప్రకటించారు. రోజుకొక కన్ప్యూజన్‌తో సెకండ్ డోస్ ప్రక్రియ మందకొడిగానే సాగుతోంది.

చేతిలో నిల్వలున్నా ఆపేసిన ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం 18-44 ఏజ్ గ్రూపువారి కోసం రాష్ట్రానికి సుమారు నాలుగున్నర లక్షల డోసుల టీకాలను పంపింది. అయితే తగినంత నిల్వలు పోగయ్యేంతవరకు ‘టీకా ఉత్సవ్‘ను ప్రారంభించబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రోజుకు సగటున రెండు లక్షల డోసులు ఇస్తున్నందున ఈ కోటా రెండు రోజుల్లోనే అయిపోతుందని ఆ శాఖ అధికారులు వ్యాఖ్యానించారు. రెండు వారాల వ్యవధికి కేవలం నాలుగున్నర లక్షల డోసులే ఇచ్చినందున ఆ ప్రక్రియను రెండు రోజులతోనే సరిపెట్టడం సరైంది కాదని ఆ స్టాకును భద్రంగా ఉంచారు.

కొవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసును తీసుకున్న తర్వాత నాలుగు నుంచి ఆరు వారాలకు రెండో డోసును తీసుకోవచ్చని ఇంతకాలం సీరం ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది. కానీ ఇటీవల దాన్ని 12 ను,చి 16 వారాలకు పెంచినందున సెకండ్ డోస్‌ను ఇప్పటికిప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ అభిప్రాయపడుతోంది. ఇప్పుడు చేతిలో ఉన్న స్టాకును కేవలం సెకండ్ డోస్ వారికి మాత్రమే వినియోగిస్తున్నందున కొవిషీల్డ్ కొత్త నిబంధన ప్రకారం మరో ఆరు వారాల వరకూ ఇవ్వాల్సిన అవసరం తప్పింది. ఆ ప్రకారం సిద్ధంగా ఉన్న స్టాకును ఫస్ట్ డోస్‌గా ప్రజలకు ఇచ్చే వెసులుబాటు ఉన్నప్పటికీ దానిపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.

సెకండ్ డోస్‌కు ఎలాగూ ఇంకో ఆరు వారాల గడువు ఉందన్న పేరుతో రెండు రోజుల క్రితం వరకూ కొనసాగిన సెకండ్ డోస్ ప్రక్రియను నిరవధికంగా నిలిపేసింది. దీంతో అటు పస్ట్ డోస్, ఇటు సెకండ్ డోస్ తీసుకోడానికి ఎవ్వరికీ అవకాశం లేకుండా పోయింది. తగినన్ని నిల్వలు లేవన్న కారణంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను నిరవధికంగా మొత్తానికే ఆపిన ప్రభుత్వం మళ్ళీ ఎప్పటి నుంచి ప్రారంభించనున్నదీ సస్పెన్స్ గానే మిగిలిపోయింది.


Next Story

Most Viewed