కరోనాతో ఏ ఒక్కరూ చనిపోవద్దు

by  |
కరోనాతో ఏ ఒక్కరూ చనిపోవద్దు
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదన్నదే తన కోరిక, లక్ష్యం అని, ఇది సాకారం కావాలంటే పాజిటివ్ బారిన పడి కోలుకున్నవారు ప్లాస్మాను దానం చేయాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వ్యాఖ్యానించారు. ప్లాస్మా థెరపీ ద్వారా సీరియస్‌గా ఉన్న కరోనా బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడవచ్చని, త్వరగా కోలుకునేందుకు దోహదపడవచ్చునని అన్నారు. ఇప్పటికే కరోనాబారిన పడి చికిత్స అనంతరం కోలుకుని ఇళ్ళకు వెళ్ళినవారు ప్లాస్మాను దానం చేసి వందలాది మందికి పునర్జన్మ ప్రసాదించాలని ఆమె పిలుపునిచ్చారు. ఈఎస్‌ఐ ఆసుపత్రిలో శనివారం ప్లాస్మా బ్లడ్ బ్యాంకును సందర్శించిన సందర్భంగా గవర్నర్ పై వ్యాఖ్యలు చేశారు.

ఈఎస్‌ఐ ఆసుపత్రిలో ప్లాస్మా థెరపీకి సంబంధించిన అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని, నేరుగా ఇక్కడకు వచ్చి ప్లాస్మాను దానం చేయవచ్చని అన్నారు. ప్లాస్మాను దానం చేసిన సంతోష్‌కు ఆమె పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు. తెలంగాణ ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాలని గవర్నర్ సూచించారు. కరోనా వ్యాధి తీవ్రంగా ఉండి ఇబ్బందుల్లో ఉన్న పేషంట్లను రక్షించడానికి ప్లాస్మా థెరపీ మంచి ఫనితాలు ఇస్తోందని, శాస్త్రీయపరంగానే ఇది రుజువైందని, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో విస్తృతంగా వినియోగంలో ఉందని ఆమె గుర్తుచేశారు. కొవిడ్ నిరోధక యాంటీ బాడీలు సరైన మోతాదులో ఉన్నవారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

కరోనా బారిన పడి కోలుకున్నవారు వేల సంఖ్యలో ఉంటారని, కానీ అందరి ప్లాస్మా ఉపయోగపడకపోవచ్చని, శరీరంలో తగినంత సంఖ్యలో యాంటీ బాడీలు ఉన్నవారు, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేనివారి ప్లాస్మా ఉపయోగపడుతుందని వివరించారు. రక్తదానంపై ప్రజల్లో ఒక సాధారణ అపోహలు ఉన్నట్లుగానే ప్లాస్మా దానంపైనా ఉంటాయని, కానీ అలాంటి భయాలు అవసరం లేదని, మరో రకంగా ఇలాంటి దానాలు చేయడం ద్వారా ఎప్పటికప్పుడు కొత్త కణాలు పుడుతూ మరింత ఆరోగ్యవంతంగా ఉంటామని, ఒక వైద్యురాలిగా చెప్తున్నానని గవర్నర్ మీడియాతో మాట్లాడుతూ వివరించారు.

ఒక గవర్నర్‌గా కాక ప్రజల సేవలో ఒక ఉత్ప్రేరకంగా భావిస్తూ పనిచేస్తున్నానని, రాష్ట్ర ప్రధమ పౌరురాలిగా కాకుండా సామాన్యులలో ఒకరిగా ఈ రాష్ట్రం అభివృద్ధిలో, కృషిలో ప్రభుత్వానికి తోడుగా ఉంటానని పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న మీడియా ప్రతినిధులను కూడా ఆమె పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందించారు.

Next Story

Most Viewed