పెన్షన్ కావాలా.. రైతు బంధా..? ఏదైనా ఒక్కటే.. దరఖాస్తులకు రేపే చివరితేది..

by  |
farmer
X

దిశ, కాటారం: ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బీమా పథకం అన్నదాతల కుటుంబాలకు అండగా నిలుస్తోంది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులు, గతంలో దరఖాస్తు చేసుకోని రైతులకు రైతు బీమా దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీని గడువుగా నిర్ణయించారు. దీని ద్వారా వివిధ కారణాలతో మరణించిన కర్షకుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రీమియం మొత్తాన్ని ప్రభుత్వమే చెల్లించి రూ.5 లక్షల బీమా కల్పిస్తోంది. రైతు బీమా పథకంలో ఈ ఏడాది ఆగస్టు 3న నుంచి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. అర్హులైన రైతులు ఈ నెల 30 వరకు సదరు ఏఈఓలకు దరఖాస్తు చేసుకోవాలి.

సోమవారం నాడు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. ఇప్పటికీ చాలా మంది దరఖాస్తు చేసుకోలేదని సమాచారం.దీనిని గుర్తించిన వ్యవసాయ శాఖ వినూత్న ఆలోచన చేసింది. రెవెన్యూ అధికారుల నుంచి పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతుల జాబితా తీసుకొని మండలాల వారీగా అర్హుల వివరాలను తయారు చేశారు. ఆ జాబితా ప్రకారం దరఖాస్తులు పరిశీలించి ఇంకా ఆసక్తి చూపని పేర్లతో మరో జాబితాను రూపొందించి గ్రామపంచాయతీ నోటీస్ బోర్డు, రైతు వేదికల వద్ద అంటించారు. క్లస్టర్ ఏఈవోలకు వారి వివరాలను పంపి దరఖాస్తు చేసేలా ఫోన్లు చేసి మరీ ప్రోత్సహిస్తున్నారు. రైతు కుటుంబ సభ్యులకు సైతం జాబితాలు పంపి వారిని దరఖాస్తు చేసేలా చూడాలని ఎంకరేజ్ చేస్తున్నారు.నూరు శాతం మంది రైతులకు బీమా కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం కోసం నూతన విధానాన్ని అమలు చేస్తున్నట్టు మహదేవ్పూర్ ఏడీఏ శ్రీనివాసరాజు వివరించారు.

అనర్హుల గుర్తింపు..

రైతు బీమా పథకంలో అనర్హులను తొలగించే ప్రక్రియ చేపట్టారు. ఇందుకు పింఛను లబ్దిదారుల జాబితా ఆధారంగా వ్యవసాయ యంత్రాంగం క్షేత్రస్థాయిలో విచారణ జరుపుతోంది. రైతు బీమా పథకంలో సభ్యులుగా ఉన్నవారిని జల్లెడ పడుతున్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాతో కింది స్థాయిలో విచారణలో ఒక్కో అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. కాటారం, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల, మల్హర్రావు మండలాల్లో 37,474 మంది పట్టాదారు ఉండగా, 22,871 మంది రైతులను అర్హులుగా తేల్చారు. ఈ ఐదు మండలాల్లో 7,906 మంది రైతులు అనర్హులుగా తేల్చారు. 6,374 మంది రైతుల గురించిన వివరాలను గ్రామాల వారీగా సర్వే నిర్వహిస్తున్నారు.

క్షేత్రస్థాయిలో విచారణ…

వ్యవసాయ శాఖ కాటారం మండలానికి ఇచ్చిన రైతు బీమా జాబితా లబ్ధిదారుల వివరాలపై మండలంలోని గ్రామాల్లో అధికారులు ఆరా తీస్తున్నారు. రైతు బీమా పథకంలో సభ్యులుగా ఉండి వివిధ పథకాల్లో పింఛను పొందుతున్న లబ్దిదారులు కాటారం మండలంలో 90, మహా ముత్తారం 47, మలహర్‌లో 34 మంది ఉన్నట్లు కాటారం వ్యవసాయాధికారి రామకృష్ణ తెలిపారు. సదరు రైతు ప్రభుత్వం నుంచి పింఛన్ పొందుతారా..? లేక రైతు బీమా పథకంలో సభ్యులుగా ఉంటారా? అని అడుగుతూ రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. చివరకు నెలవారీగా వచ్చే పింఛను తీసుకునేందుకు మొగ్గు చూపుతున్న రైతుల వివరాలు తీసుకుని.. రైతు బీమా వద్దంటూ రాసి ఇచ్చిన డిక్లరేషన్ కూడా వారి నుంచి తీసుకుంటున్నారు. దీని ఆధారంగా సదరు రైతు పేరుపై రైతు బీమా ప్రీమియం కట్టకుండా అధికారులు చర్యలకు ఉపక్రమించారు. అనగా రైతులు పింఛన్ కావాలంటే, రైతు బీమా వదులుకోవాలి.

బయటపడింది ఇలా..

గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రభుత్వ పింఛన్లు పంపిణీ చేస్తుండగా.. వ్యవసాయ శాఖ రైతు బీమాను అమలు చేస్తోంది. ఈ రెండు శాఖలకు కమిషనర్‌గా రఘునందన్ రావు ఒక్కరే వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో పింఛనుదారుల దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా వస్తుండటం.. ఇటు ఏటా రైతు బీమా దరఖాస్తు పెరగడంతో.. అటు పింఛను, ఇటు రైతు బీమా దరఖాస్తులకు జతచేసిన ఒకే రకం ఆధార్ నెంబర్‌ను సాంకేతిక పరిజ్ఞానంతో పట్టుకోవడం సులువైంది. ఇలా ఇలా రైతు బీమాలో సభ్యులుగా ఉండి వివిధ రకాలుగా పింఛను పొందుతున్నవారిని వ్యవసాయ శాఖ గుర్తించింది. ఇలా గుర్తించిన జాబితాతో లబ్ధిదారు డిక్లరేషన్‌తో రెండు పథకాల్లో ఏదో ఒకటి వర్తించేలా చర్యలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు.

Next Story

Most Viewed