కొల్చారం సత్యసాయి రైస్ మిల్లు పై విజిలెన్స్ దాడులు

by Batti.Sumithra |

మండల కేంద్రంలోని సత్యసాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌ పై సోమవారం పౌరసరఫరాల శాఖ ప్రత్యేక విజిలెన్స్ అధికారుల బృందం నిర్వహించిన తనిఖీల్లో 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో భారీ తేడాలు వెలుగులోకి వచ్చాయి.

కొల్చారం సత్యసాయి రైస్ మిల్లు పై విజిలెన్స్ దాడులు
X

దిశ, కొల్చారం : మండల కేంద్రంలోని సత్యసాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌ పై సోమవారం పౌరసరఫరాల శాఖ ప్రత్యేక విజిలెన్స్ అధికారుల బృందం నిర్వహించిన తనిఖీల్లో 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించిన సీఎంఆర్ ధాన్యం నిల్వల్లో భారీ తేడాలు వెలుగులోకి వచ్చాయి. 2025–26 ఖరీఫ్ సీజన్‌లో సత్యసాయి ఆగ్రో ఇండస్ట్రీస్‌కు సీఎంఆర్ కింద ప్రభుత్వం 7,720.520 మెట్రిక్ టన్నుల ధాన్యం కేటాయించింది. ఈ ధాన్యానికి సంబంధించి సీఎంఆర్‌లో భాగంగా 5,172.000 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి సరఫరా చేయాల్సి ఉంది. కాగా, ఇప్పటివరకు 2,207.000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీఎంఆర్ మార్కెటింగ్ ద్వారా ప్రభుత్వానికి సరఫరా చేశారు. సీఎంఆర్ కింద సరఫరా చేసిన బియ్యం నిల్వలను మినహాయిస్తే, మిల్లులో ఇంకా 4,426.490 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ ఉండాల్సి ఉండగా, తనిఖీల సమయంలో కేవలం 1,396.536 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో 3,029.960 మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వలు గల్లంతైనట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ పౌరసరఫరాల శాఖ అధికారులు మిల్లు యాజమాన్యం పై ఈసీ చట్టం–1955, సెక్షన్ 6(ఏ) కింద కేసునమోదు చేసి, మిల్లును సీజ్ చేసినట్లు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నిత్యానంద తెలిపారు.

పూర్తిస్థాయి విచారణ జరిపితే..

2022–23 రబీ సీజన్ నుంచి 2025–26 యాసంగి సీజన్ వరకు ధాన్యం నిల్వలపై విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపడితే మరింత పెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

Next Story