కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారు ఫెయిల్..

by  |
కరోనా కట్టడిలో తెలంగాణ సర్కారు ఫెయిల్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. ఎన్నికలపై పెట్టిన శ్రద్ధను కరోనా కట్టడి మీదా, ప్రజల సంక్షేమం మీదా అధికార టీఆర్ఎస్ పెట్టలేదని విమర్శించారు. హైకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత మాత్రమే నైట్ కర్ఫ్యూ పెట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి ప్రభుత్వం దగ్గర సరైన కార్యాచరణ కూడా లేదన్నారు. పార్టీ మూడవ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండాను ఎగురవేసిన సందర్భంగా కోదండరాం పై వ్యాఖ్యలు చేశారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులన్నీ కరోనా పేషెంట్లతో నిండిపోయాయని, ఖాళీ బెడ్‌లు దొరకడం గగనంగా మారిందన్నారు. కరోనా కట్టడిలో సర్కారు విఫలమైనందువల్లనే ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్ విధించుకుంటున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం వైద్య సదుపాయాలను విస్తృతం చేయాలని, టీకాలను తగిన సంఖ్యలో అందుబాటులో ఉంచాలన్నారు. కరోనా బారిన పడినవారిని ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటుచేయాలన్నారు. కరోనా లెక్కలన్నీ తప్పుల తడకలేనని, వాస్తవ లెక్కలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఆక్సిజన్, మందులు తదితరాలేవీ ప్రజలకు అందుబాటులో లేవని, వెంటనే ఈ విషయంలో ప్రభుత్వం తన చిత్తశుద్ధిని ప్రదర్శించాలన్నారు.

ఆస్తులు పోగేసుకోడానికి రాజకీయాల్లోకి రావద్దని, ప్రజా సేవ చేయాలనుకున్నవారు మాత్రమే రావాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజకీయ వ్యవస్థను మార్చడానికే తాను పార్టీ పెట్టాల్సి వచ్చిందన్నారు. ఆస్తులు పోగేసుకునే ఆలోచన లేదని, ఈ మూడేళ్ల కాలంలో ప్రజా ఉద్యమాలను నిర్మించామన్నారు. భవిష్యత్తులోనూ ప్రజల పక్షాన తమ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.

Next Story